ఖైరతాబాద్, అక్టోబర్ 12: కొత్తగా ఇళ్లు కట్టుకుంటే కొందరు అధికారులు, సిబ్బందికి పండుగే. ఎలాంటి అనుమతులు కావాలన్నా లంచం తీసుకోవడం వారి నైజం. చిన్నపాటి ఇంటికి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేస్తే ఇద్దరు అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. మంగళవారం రాత్రి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జోన్ పరిధిలో మామిడి జ్ఞానేశ్వర్ తన ఇంటి మ్యుటేషన్ కోసం సర్కిల్ 12 మెహిదీపట్నం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కౌళిక సురేశ్ కుమార్ను సంప్రదించాడు. అయితే సర్కిల్ కామటి, ఇన్చార్జి బిల్లు కలెక్టర్ పల్లెపాగా రాజేశ్వర్ను లంచం కోసం పురమాయించాడు. రూ.6వేలు ఇస్తేనే మ్యుటేషన్ చేయిస్తామని ఇద్దరూ హామీ ఇచ్చారు. దీంతో తాను అంత ఇచ్చుకోలేనని, రూ.5 వేలు మాత్రం ఇస్తానని చెప్పగా, సురేశ్ కుమార్, రాజేశ్వర్లు ఆ మొత్తాన్ని మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో అందించాలని సూచించారు. కాగా, బాధితుడు ముందస్తుగా ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారి సూచనల మేరకు డబ్బులు తీసుకొని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయంలోని సర్కిల్ 12 సెక్షన్లో వారికి అందజేస్తుండగా అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురు ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్సై పాల్గొన్నారు.