ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడూ కనిపించని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్తున్నారని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రశ్నించారు. బండి చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, అది ప్రజల మీద చేస్తున్న సంగ్రామ యాత్ర అని మండిపడ్డారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ యాత్ర చేపడుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేకుండా, ప్రజల సమస్యల పట్ల కనీసం అవగాహన లేని బండి సంజయ్ పార్టీలో పట్టుకోసం, మోడీ, అమిత్ షాల మెప్పు కోసం యాత్ర చేపడుతున్నారని విమర్శించారు. యాత్ర పేరుతో వస్తున్న బండి సంజయ్ను కేంద్ర సర్కారు వైఫల్యాలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాన్యులకు అందకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రశ్నించాలని కోరారు.