ముషీరాబాద్, మార్చి 7: అనారోగ్యంతో మృతిచెందిన అడిక్మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బి.జయరాం రెడ్డి (68) పార్థివ దేహాన్ని ఆదివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన జయరాంరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు, అడిక్మెట్ డివిజన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకున్ని కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అదే విధం గా పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు జయరాంరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించిన నివాళులర్పించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, ముఠా జయసింహ, వి.సుధాకర్ గు ప్త, రోశం బాలు, నాయకులు నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, మల్లికార్జున్రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆర్.కల్పనా యాదవ్, నల్లబెల్లి అంజిరెడ్డి, విజయ్ యాదవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం బన్సీలాల్పేట స్మశాన వాటికలో జయరాంరెడ్డి పార్థీవ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.