మాదాపూర్ / కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 18 : ఈ నెల 25వ తేదీన జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రజాప్రతినిధులకు బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో సోమవారం కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు ప్లీనరీ సమావేశానికి చెందిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లు పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సభకు రానున్న ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పార్కింగ్ సమస్య రాకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు భోజన ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించినందున ఆయన సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లీనరీకి హాజరయ్యే నాయకులు, కార్యకర్తలందరికీ ఇబ్బందులు లేకుండా భోజన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సహకారంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరుకానున్న ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్గౌడ్తో కలిసి పార్కింగ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు గౌస్, ఖాజా, లోకేశ్, సతీష్ పాల్గొన్నారు.