మాదాపూర్ : టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్లీనరీ పండుగకు గ్రేటర్ సిద్ధమైంది. ఎటూ చూసినా నగరం గులాబీమయంగా మారిపోయింది. సభ జరిగే హెచ్ఐసీసీ వేదిక వైపు వచ్చే మార్గాలన్నీ గులాబీ తోటను తలపిస్తున్నాయి. ముఖ్యకూడళ్లలో సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, సంక్షేమ పథకాలను వివరించే ఫ్లెక్సీలు దర్శమిస్తున్నాయి. కేబీఆర్ పార్కు నుంచి -జూబ్లీహిల్స్ చెక్పోస్టు, నెక్లెస్రోడ్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, బేగంపేట రూట్లలో హోర్డింగ్స్లలో ఫ్లెక్సీలు భారీగా దర్శనమిస్తున్నాయి. జంక్షన్లలో తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే అతిథులకు అపూర్వ ఆహ్వానం పలుకుతూ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.
ఇక సభా ప్రాంగణాన్ని అట్టహాసంగా ముస్తాబు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ కళాతోరణం, హైదరాబాద్ ఐకానిక్ ప్రాజెక్టు దుర్గం చెరువుల థీమ్తో సభా ప్రాంగణం ఎల్ఈడీ ధగధగలతో రూపొందుతున్నది. 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో భారీ ప్రవేశ ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నది. వేలాది ఫొటోలతో ఉద్యమ నాయకుడి జీవిత చరిత్ర, ఏడేండ్ల పాలన, అభివృద్ధిపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 20వేల మంది అంచనాతో 36 రకాల భోజనాలను సిద్ధం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీల చైర్మన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల వరకు గులాబీ దుస్తులు ధరించి సభకు రానున్నారు.
ఉదయం 10 గంటలకు ప్లీనరీ మొదలు కానుండగా, రిజిస్ట్రేషన్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత 11 గంటలకు సభ ప్రారంభం అవుతుంది. రెండు సెషన్లలో సభ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొలి సెషన్, రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నిక, తర్వాత సీఎం కేసీఆర్ స్పీచ్, ఏడు తీర్మానాలకు ఆమోదం లాంటివి ఉండనున్నాయి.
సభకు హాజరయ్యే వారికి ప్రధాన ద్వారంలో 36 అడుగుల మేర సీఎం కేసీఆర్ నిలువెత్తు భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల భారీ కటౌట్లను ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు.
హైటెక్స్లో సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, సదస్సులు జరుగుతుంటాయి. వీటితో పాటు ప్రముఖుల వివాహాలు, సినిమా కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతుంటాయి. అలాంటి చోట మొట్టమొదటి సారిగా టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కనీవిని ఎరుగని రీతిలో ప్లీనరీ వేడుకలను నిర్వహిస్తున్నది. ఐటీ కారిడార్ ఎటు వైపు చూసినా గులాబీ గుభాళిస్తోంది. అడుగడుగునా సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్లతో హైటెక్స్లో పండుగ వాతావరణం నెలకొంది.
టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్ల ప్రయాణంలో గులాబీ రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్తో మొదలైన ప్రస్థానం కోట్ల మందిని కదిలించిన ఫలితమే నేడు టీఆర్ఎస్ ప్లీనరీ సభ ఏర్పాటుకు కారణం. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న పార్టీ ప్రతినిధుల కొరకు ఏర్పాటు చేసిన మహాసభలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేశారు. ఆహ్వానాన్ని అందుకున్న ప్రతినిధులు మాత్రమే సభకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వారి కొరకు ప్రత్యేక రుచులతో భోజనాలను సిద్ధం చేశారు. సభ ప్రాంగణానికి వెళ్లే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. హైటెక్స్ ప్రాంగణం ప్రధాన ద్వారం మొదలుకొని సభా ప్రాంగణం వరకు వివిధ ఏర్పాట్లు, అలంకరణతో ముస్తాబు చేశారు.
పార్టీ ప్రతినిధులు హజరుకానున్న సభ ప్రాంగణాన్ని జెండాలు, గులాబీ తోరణాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభా ప్రాంగణంలో 8 అడుగులకు ఒకరు చొప్పున 6500 మంది సౌకర్యవంతంగా కూర్చునేలా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. మం త్రులు, కార్యవర్గ సభ్యులు కలిపి 100 మంది కూర్చునేందుకు వీలుగా సభా వేదికను ముస్తాబు చేశారు. ఇందులో విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు, ఇక మీదట చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించనున్నట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు.
ప్లీనరీకి విచ్చేయనున్న ప్రతినిధులు, పోలీసులు, గన్మెన్లు, మీడియా ప్రతినిధులు, వలంటీర్లతో పాటు డ్రైవర్లను కలుపుకొని సభా ప్రాంగణం లోపల, బయట మొత్తం 20 వేల మందికి పైగా హాజరుకానున్న నేపథ్యంలో వారందరి కొరకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమకు చెందిన 36 రకాల రుచికరమైన శాఖాహారం, మాంసాహారంతో పాటు పచ్చళ్లు, స్వీట్లను ఏర్పాటు చేశారు. వారందరికీ కలిపి 6 డైనింగ్ హాల్లను భోజనం చేసేందుకు సిద్ధం చేశారు. ఇందులో మొత్తం 650 మంది వంట సిబ్బంది పాల్గొనగా 300 మంది భోజనం సిద్ధం చేసేవాళ్లు కాగా 300 మంది వడ్డించేవారు, 50 మంది ఇతర పనులు చేసే వారు ఉన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సభకు విచ్చేయనున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా హైటెక్స్ చుట్టుపక్కల 50 ఎకరాల్లో 14 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఇందులో జయభేరి, అన్నమయ్యపురం, బొటానికల్ గార్డెన్, ఆర్టీఏ కార్యాలయం వద్ద, న్యాక్, నోవాటెల్ పి1, పి2 పార్కింగ్లతో పాటు మరికొన్ని చోట్ల పార్కింగ్ స్థలాలను కేటాయించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలైన ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, జహీరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కొరకు ఈ పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
సభా ప్రాంగణానికి హాజరయ్యే ముందు మార్గమధ్యలో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్శణగా నిలువనుంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ 2001 మొదలుకొని 2021 వరకు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఫొటోలు, పెయింటింగ్ రూపంలో ప్రదర్శించారు. కాకతీయ ఇన్నోవేటివ్ సంస్థ ప్రతినిధి బందూక్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో 2 వేలకు పైగా ఉద్యమ ఘట్టాలు, రాష్ట్ర సాధన, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు.