సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్లీనరీ, తెలంగాణ విజయగర్జన సభలకు సన్నద్ధం కావాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 25న జరిగే ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల విజయవంతానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని కోరారు. బహిరంగ సభకు ప్రతి వార్డు, జిల్లా కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పెద్దఎత్తున హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి తలసానితో కలిసి కేటీఆర్ హైదరాబాద్లోని పలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, డివిజన్ కమిటీలు, కార్పొరేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఉదయం ముషీరాబాద్-అంబర్పేట, ఖైరతాబాద్-జూబ్లీహిల్స్, సనత్నగర్-సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజవర్గ నేతలు, మధ్యాహ్నం మంత్రులు తలసాని, మహమూద్ అలీలతో కలిసి గోషామహల్-చార్మినార్, చంద్రాయణ గుట్ట, నాంపల్లి, మలక్పేట, బహదూర్ఫుర, కార్వాన్, యాకత్పుర నియోజకవర్గ నేతలతో మంత్రి కేటీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లీనరీకి వచ్చే నేతలంతా గులాబీ రంగు వస్ర్తాలు ధరించాలన్నారు.
ప్లీనరీ రోజు ప్రతి డివిజన్ను గులాబీమయం చేయాలని.. గ్రేటర్లో ఎటుచూసినా గులాబీ జెండాలు రెపరెపలాడాలని.. పండుగ వాతావరణం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే అతిథులు, ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వరంగల్లో నిర్వహించే విజయగర్జనకు ఈ నెల 27న నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని అన్నారు. ప్రతి డివిజన్కో బస్సు ఏర్పాటు చేస్తామని.. ప్రతిఒక్కరూ సమన్వయం చేసుకుంటూ విజయగర్జన సభకు తరలిరావాలని కోరారు.
ప్లీనరీ అనంతరం పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, సాయన్న, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జి.లాస్యనందిత, ముఠా పద్మ, ఎడ్ల భాగ్యలక్ష్మీ యాదవ్, వి.శ్రీనివాస్రెడ్డి , ఎడ్ల హరిబాబు యాదవ్, డివిజన్ అధ్యక్షులు ఆర్ మోజస్, బి.శ్రీనివాస్రెడ్డి, రాకేష్, వై.శ్రీనివాస్, వల్లాల శ్యామ్ యాదవ్, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్ పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం. బడుగు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. ఇవన్నీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రతిఒక్కరూ వీటితో లబ్ధి పొందుతున్నారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఎప్పటికప్పుడు వివరిస్తుండాలి. ద్విదశాబ్ది వేడుకలకు ప్రజాప్రతినిధుల నుంచి సాధారణ కార్యకర్త వరకు ప్రతిఒక్కరూ తరలిరావాలి. పార్టీ నాయకులను విమర్శించే వారిపై దూకుడుగా వ్యవహరించాలి.- జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
ప్లీనరీతో పాటు ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి టీఆర్ఎస్ సత్తా చాటుతాం. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతాం. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టకొని సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన పథకాలు ప్రతిఒక్కరి మనసు దోచుకుంటున్నాయి. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎన్నో సభలు, మరెన్నో సమావేశాలతో గ్రేటర్పై చెరగని ముద్ర వేసిన టీఆర్ఎస్ మరోసారి గులాబీ పండుగ నిర్వహణకు సిద్ధమవుతున్నది. ఈ నెల 25న హెచ్ఐసీసీ వేదికగా ప్లీనరీని నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చేందుకు గ్రేటర్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
ముఖ్యంగా గ్రేటర్ వేదికగా నిర్వహిస్తున్న ప్లీనరీలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల ప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించగా.. ఇప్పటికే ఏర్పాట్లలో వారు నిమగ్నమయ్యారు. నగర ప్రధాన ద్వారాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అనుమతించిన ప్రాంతాల్లో హోర్డింగ్స్, స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి మరోసారి గ్రేటర్ నేతలు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సైప్లె చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు
సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్లీనరీ అంటే రాజకీయ తీర్మానాలే కాదు రుచికరమైన వంటకాలకూ ప్రసిద్ధి. ఈ సారి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు 29 రకాల వంటలకు సంబంధించి మెనూ ఫైనల్ చేశారు. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం చేస్తున్నారు.
ఈసారి ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా వడ్డించనున్నారు. ఫుడ్ కమిటీ ఇన్చార్జి మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఈసారి 29 రకాల వంటలను వండనున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు.
ధమ్ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్, బోటిఫ్రై, ఎగ్ మసాలా, రుమాల్ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్రైస్, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు+క్రీమ్, పెరుగు, వంకాయ చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్, వడియాలు, జిలేబీ, డబల్ కా మీఠా, ఐస్ క్రీం, గ్రీన్ సలాడ్, బటర్ రైస్, డ్రై ఫ్రూట్స్, కారా, బూంది, లడ్డూ, చాయ్ అందివ్వనున్నారు.
ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలకు రుచికరమైన భోజనం అందిస్తాం. గతంలో రెండుసార్లు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించా. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ తిరిగి నాకే బాధ్యతలు అప్పగించారు. సుమారు 15 వేల మందికి వెజ్, నాన్వెజ్ వంటల రుచి చూపించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం చెయ్యి తిరిగిన 500 మందిని నియమిస్తున్నాం. వాలంటీర్లు, ప్రత్యేక సిబ్బందితో ఒకేసారి 8 వేల మంది భోజనాలు చేసేలా చూస్తున్నాం.- మాధవరం కృష్ణారావు, ఫుడ్కమిటీ ఇన్చార్జి
మేడ్చల్, అక్టోబర్19 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో మేడ్చల్ జిల్లా నాయకులు తెలంగాణ భవన్లో బుధవారం సమావేశం కానున్నారు. ఇందులో పార్టీ బలోపేతం, ప్లీనరీపై చర్చించనున్నారు. సమావేశంలో మంత్రి మల్లారెడ్డితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.