సిటీబ్యూరో, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఒక ఫంక్షన్కు భోజన సదుపాయాలు సమకూర్చాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సి ఉంటుంది. అలాంటిది ఏకంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 20 వేల మందికి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కాని, అదంతా ఆ ప్రజాప్రతినిధికి ఎంతో సులభం. తన బృందంతో కలిసి రాత్రింబంవళ్లు శ్రమించి 36 రకాల వంటకాలను వివిధ వెరైటీలతో శుచితో రుచికరంగా అందించి అమోఘమనిపించారు. ప్లీనరీలో వరుసగా మూడోసారి భోజన కమిటీకి ఇన్చార్జిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, పార్టీ అధిష్టానం మన్ననలు పొందారు. ఆయనెవరో కాదు.. కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
ప్లీనరీ వేడుకల్లో భోజన కమిటీ ఇన్చార్జిగా తనదైన పాత్ర పొషించారు. ప్లీనరీకి హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీలు, డెలిగేట్స్, మీడియా, పోలీస్, మహిళా కార్యకర్తలు ఇతరత్రా వారికి భోజనాలు అందించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అని మరిచిపోయి, ఓ సాధారణ భోజనశాల ఇన్ఛార్జిగా అన్ని వైపులా కలియ తిరుగుతూ, ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అంచనాకు మించి ప్రతినిధులు హాజరయినా వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం చేయించి, వారిని పంపించి వేయడంలో ఆయన తీసుకున్న చొరవ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయ్యప్పస్వామి మాలధారణలో ఉన్నప్పటికీ భోజనాల తయారీ, ఏర్పాట్లు, ప్లీనరీలో భోజనాల ప్రక్రియ ముగింపు వరకు అలుపెరగకుండా ఎమ్మెల్యే కృషి చేసిన తీరు పట్ల పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు వెలువెత్తాయి.