పట్టభద్రుల ఎన్నికల్లో పాలమూరు ఓట్లే కీలకంగా మారనున్నాయి. 2015 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇదే జరిగింది. అందుకే ప్రధాన పార్టీలన్నీ పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించాయి. పాలమూరు ఓటర్లు చైతన్యంతో ఓటేసి తమను గట్టెక్కిస్తారనే నమ్మకంతో నేతలంతా ఉమ్మడి మహబూబ్నగర్ బాట పట్టారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు గతంలో ఏ ఎన్నికలు చూసుకున్నా నగర ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. అన్ని పార్టీల అభ్యర్థులు పాలమూరుపైనే ఆశలు పెట్టుకున్నారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే వాణీదేవి పాలమూరు ప్రాంతానికి చెందిన కోడలే కావడంతో ఆమెకు కలిసొచ్చే అవకాశం ఉంది.
2015 పట్టభద్రుల ఎన్నికల్లో 2,96,318 మంది ఓటర్లకుగాను 1,13,380మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది కేవలం 39శాతం మాత్రమే కావడం గమనార్హం. హైదరాబాద్ నగరంలో గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయలేదు. కేవలం 29శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. దీన్ని బట్టి పట్టణ పట్టభద్రుల బద్దకం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే రంగారెడ్డి జిల్లా ఓటర్లు కూడా దాదాపు నగరాన్ని అనుసరించగా ఇక్కడ 34శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. కానీ వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం 55శాతం ఓటింగ్ నమోదైంది. దీంతోనే మొత్తం ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడినట్లయ్యింది. గత ఎన్నికల్లో ఉదయం 11గంటల తర్వాత పట్టభద్రులు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. చాలా చోట్ల కేంద్రాలు బోసిపోయాయి. కానీ ఈ సారి మాత్రం పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5,31,268 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో 1,19,367 మంది ఓటర్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారే కావడంతో వీరి ఓట్లపైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. పాలమూరు ఓటర్లు పక్కాగా ఓట్లేస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఓట్లను నమ్ముకుంటే మంచి మెజార్టీ వస్తుందని నేతలు అక్కడ ఎక్కువగా దృష్టిపెట్టారు. వెనుకబడిన జిల్లాగా పేరు పొందినప్పటికీ ఎన్నికల్లో తమ బాధ్యతను నిర్వర్తించడంలో మాత్రం మిగతా రెండు జిల్లాల కంటే పాలమూరు ఎంతో ముందుందని ఇక్కడి పట్టభద్రులు నిరూపించారు. ఈసారి ఇక్కడి ఓటింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాలమూరు పట్టభద్రుల ఓట్లే కీలకం కావడంతో టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఓటరు నమోదు నుంచి ఎంతో ముందుచూపుతో వ్యవహరించింది. గత ఎన్నికల్లో 55శాతం ఓటింగ్ ఉండగా ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పాలమూరును వెనుకబడిన ప్రాంతం అని అంటారు. కాని అది ఒకప్పటి మాట. ఇప్పుడు పాలమూరు అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ప్రజలు సైతం ఎంతో చైతన్యవంతులయ్యారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలమూరు ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి కంటే ఎక్కువ శాతం పోలింగ్లో పాల్గొన్నారు. గతంలో నమోదైన 55శాతం కంటే ఈ సారి మరింతగా పోలింగ్ శాతం పెరుగుతుంది. గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వెనుకబడిన పాలమూరును ఎంతో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కడుతారు. – రవికుమార్, చైర్మన్, జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాల