స్వరాష్ట్ర సాధనలో సబ్బండ వర్గాలు, సకల జనులు, అనేకానేక సంఘాలు, ఎన్నో ఉద్యమరూపాలు, అపూర్వ ఘట్టాలు, మరెన్నో చరిత్రక మలుపులు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మార్గనిర్దేశకత్వంలో నాటి ఉద్యమనేత, నేటి సీఎం కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న కొండాలక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా పార్టీని ప్రకటించారు. నాటి నుంచి ఎత్తిన జెండాను దించకుండా నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అవిశ్రాంత పోరును సలిపారు. అన్నింటా గులాబీజెండా ప్రస్థానం అజరామరం. జలదృశ్యం నుంచి గోల్కొండ కోటపై జాతీయ పతాకం ఎగురవేసే ప్రతీ ఘట్టం అపూర్వమే. ఉద్యమనేతగా, రాష్ట్ర సారథిగా ప్రత్యేక రాష్ట్ర ఫలాలను ఇంటింటా పంచుతున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రత్యేక రాష్ట్రం ఒక స్వప్నం.. దగా పడిన తెలంగాణను పరాయి పాలకుల నుంచి విముక్తి చేయాలన్న ఆకాంక్ష నుంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్. ప్రతి అడుగులోనూ రాష్ట్ర కాంక్షను ప్రతిబింబింపజేసి సకలజనుల సమైక్య స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసింది.
తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో సబ్బండవర్గాలు.. సకల జనులు.. అనేకానేక సంఘాలు.. ఎన్నో ఉద్యమ రూపాలు.. మరెన్నో చారిత్రాత్మకమైన మైలురాళ్లు.. అన్నింటా గులాబీ జెండా ప్రస్థానం అసామాన్యం. జలదృశ్యం నుంచి గోల్కొండ కోటపై స్వపరిపాలన జెండా ఎగురవేసేంత వరకూ అది పాదుకొల్పిన విశ్వాసాలు.. ప్రగతిపథంలో నమోదవుతున్న విజయాలు ఎన్నటికి చెరుగని ముద్రలే.
తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ మార్గనిర్దేశంలో భావజాలవ్యాప్తి, ఆందోళనలు, పార్లమెంటరీ రాజకీయ పునరేకీకరణే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీని నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించారు. 2001 ఏప్రిల్ 27న కొండాలక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా పార్టీని ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు మడమ తిప్పకుండా, ఎత్తిన జెండాను వీడకుండా నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అవిశ్రాంత పోరును సలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ సాగించిన ఆ మహత్తర పోరాట ప్రయాణం ఒక చారిత్రాత్మకం. ప్రతి కూడలి ఒక రణస్థలి. వేసిన ప్రతి అడుగూ ఒక చైతన్యస్ఫూర్తి. పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమమూ ఒక చిరస్మృతి. విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మదిమదిలో, వాడవాడలో అలాంటి వేదికలెన్నో. చెరగని మైలురాళ్లు.. కీలకఘట్టాలు మరెన్నో. కన్నీటి దృశ్యాలు ఇంకెన్నో. నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాటి ఉద్యమస్ఫూర్తిని యాది జేసుకోవడంలో భాగంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
సాగునీటి రంగానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో తెలిసిన విషయమే. ఇందుకు సంబంధించిన కీలకఘట్టానికి హైదరాబాద్ నగరమే వేదికగా నిలిచింది. సాగునీటి విషయంలో తెలంగాణను ఎలా మోసం చేస్తున్నారో తెలియజేసేందుకు 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 5 వరకు టీఆర్ఎస్ ఊరూరా జలసాధన దీక్షలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల్లో ఈ దీక్షలను నిర్వహించిన అనంతరం ముగింపు సభను జనవరి 6న ‘తెలంగాణ గర్జన’ పేరుతో జింఖానా మైదానంలో నిర్వహించింది. దాని ఫలితంగానే సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాజెక్టులకు కొద్దిమేర నిధులు కేటాయించారు.
టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత పార్టీ గుర్తుపై తొలిసారి అఖండ విజయాన్ని సాధించిన అనంతరం 2002 మార్చి 27న వికారాబాద్లో శంఖారావ సభను నిర్వహించారు. గులాబీ దళానికి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆ తర్వాత రాష్ట్ర సాధనే ధ్యేయంగా అడుగులు వేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్తో పాటు అనేక మంది మేధావులు, రాజకీయ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. తుదకు రాష్ట్ర సాధనకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ వేదికగా 2001 ఏప్రిల్ 27న కొండాలక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. పది జిల్లాలతో కూడిన గులాబీరంగు జెండానే పార్టీ గుర్తుగా నిర్ణయించారు. ఇది మలిదశ ఉద్యమంలో కీలక ఘట్టం. ‘గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్’ అని ఆ సందర్భంగా ఉద్యమనేత కేసీఆర్ చెప్పిన మాటలు అటు తర్వాత అక్షర సత్యాలయ్యాయి. ఆ స్ఫూర్తితోనే రెండు నెలల స్వల్పకాలంలోనే 1000 ఎంపీటీసీ స్థానాలు, 87 జడ్పీటీసీ, 84 ఎంపీపీ, కరీంనగర్ జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకుని తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటింది.
తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టినప్పుడు ఒక్కడినే ఆయన వెంట నడిచా. 2001లో జలదృశ్యంలో పార్టీ స్థాపన కోసం జరిగిన చర్చల్లో పాల్గొన్నా. పట్టువదలని విక్రమార్కుడిలా ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్దే. సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారు. ప్రజలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్. -పీచర వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో ప్రాణత్యాగం చేశారు. ఉద్యమ సారథి కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం అనంతరం బంగారు తెలంగాణ వైపు పరుగులు తీయడం ఆనందంగా ఉంది. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయన్న సీమాంధ్ర పాలకులకు చెంపపెట్టులా స్వరాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీడు భూములన్నీ ఆకుపచ్చగా మారుతున్నాయి. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న తెలంగాణ ఇక పరుగులు తీయడానికి ఉరకలు వేస్తున్నది. ఈ ఘనత సీఎం కేసీఆర్దే. -తీగుళ్ల పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్
సీఎం కేసీఆర్ వల్లే ఆడబిడ్డలు ఈనాడు సగర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారు. ఎన్నడూ దక్కని రాజకీయ అవకాశాలు పొందుతున్నారు. విద్య అందుకొని ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఉద్యమనేతగా కేసీఆర్ నాడు ఆడబిడ్డల బాధలను అర్థం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వాటిని తీరుస్తున్నాడు. సార్తో ఇరవై ఏండ్ల ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. రాష్ర్టాభివృద్ధిలో భాగమవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. – ప్రసన్న, చిక్కడపల్లి వట్టికోట అళ్వారుస్వామి నగర కేంద్ర గ్రంథాలయం చైర్పర్సన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు 2013 ఏప్రిల్ 27న సంసద్ యాత్రను టీఆర్ఎస్ చేపట్టింది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఉద్యమకారులు తరలి వెళ్లగా.. ఆ రైలుకు తెలంగాణ ఎక్స్ప్రెస్గా నామకరణం చేశారు.
దశాబ్దాల పోరాట ఫలితంగా కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది. జూన్ 2ను ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి.. ప్రజల ఆకాంక్షను నిజం చేసిన టీఆర్ఎస్ 63 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది.
నాంపల్లిలోని ఇంటర్ విద్యా డైరెక్టరేట్ వద్ద 2011 ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఉద్యోగుల సామూహిక దీక్ష శిబిరానికి హాజరైన కేసీఆర్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈజిప్ట్లోని తెహ్రిక్ చౌక్ను ఉద్యమకారులు దిగ్బంధం చేసి డిమాండ్లు సాధించుకోగా.. ఇదే స్ఫూర్తితో 2011 మార్చి 10న హైదరాబాద్లోని ట్యాంక్బండ్ దగ్గర మిలియన్ మార్చ్కు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి గులాబీ దండు కదిలివచ్చి మార్చి 10న ట్యాంక్బండ్పై కదం తొక్కారు. అటు తరువాత సెప్టెంబర్ 30, 2012 నాడు సాగరహారానికి పిలుపునిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశవ్యాప్తంగా ప్రజ్వలింపజేయాలని టీఆర్ఎస్ సంకల్పించింది. ఇందులో భాగంగా 2003 మార్చి 27న ఫలక్నుమా నుంచి రోడ్డు మార్గంలో 10 జిల్లాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి 1000 కార్లతో ర్యాలీగా వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న ఉద్యమ నేత కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు రాంవిలాస్ పాశ్వాన్ ఆహ్వానం పలికారు.
జనబాహుళ్యాన్ని తెలంగాణ ఉద్యమం వైపు నడిపించాలనే తలంపుతో ఇతర పార్టీలతో పాటు, తెలంగాణ సైద్దాంతిక భావజాలం ఉన్న ప్రముఖులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా జూన్ 25, 2003న తొలిసారిగా ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటే లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు.
యూపీఏ నుంచి వైదొలిగిన అనంతరం తెలంగాణ భావజాల వ్యాప్తికి లక్ష మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ జాగరణ సేన పేరిట మొదటి దశలో అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన 605 మందికి పైగా కార్యకర్తలకు సెప్టెంబర్ 10, 2005న నాచారంలోని సోమా ఫంక్షన్ హాలులో శిక్షణ ప్రారంభించారు. వీరికి ప్రేరక్లుగా పేరు పెట్టి యూనిఫామ్స్, కర్రలను, టైలను అందించారు.
తెలంగాణ ఏర్పాటు విషయమై కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చేందుకు యూపీఏ మిత్రపక్షాలతో కలిసి టీఆర్ఎస్ డిసెంబర్ 1, 2004లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు అజిత్సింగ్, రాందాస్, డాక్టర్ కృష్ణన్ లాంటి జాతీయ నేతలు హాజరయ్యారు. ఫలితంగా జనవరి 5, 2005న నాటి ప్రభుత్వం ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన తెలంగాణ ఏర్పాటు అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. యూపీఏలోని 13 పార్టీల్లో 11 పార్టీల మద్దతును టీఆర్ఎస్ కూడగట్టింది.
విద్యార్థి లోకాన్ని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములను చేసేందుకు సెప్టెంబర్ 17, 2003న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం ఎదుట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. తెలంగాణ ఆకాంక్షను చాటారు.