ఈనెల 7న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం
సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ టీఆర్ఎస్లో సంస్థాగత సందడి మొదలైంది. ఈనెల 2న పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం నగరవ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టి కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఎక్కడికక్కడ పార్టీ నేతలు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా.. ప్రజారంజక పాలనలో అజేయశక్తిగా మారిన టీఆర్ఎస్, సంస్థాగతంగా మరింత బలమైన శక్తిగా అవతరించేందుకు సన్నద్ధమవుతున్నది. బలం.. బలగం పెంచుకొని పార్టీని మరింత పటిష్టంగా తయారు చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే రికార్డు స్థాయి సభ్యత్వాలతో దూకుడుమీదున్న గులాబీ పార్టీ.. అన్ని స్థాయిల్లో కమిటీలను పూర్తి చేసేందుకు నేతలు రంగంలోకి దిగారు.
జెండా పండుగ తర్వాత ఆ వెంటనే పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఈనెల 12 నుంచి నెలాఖరు వరకు బస్తీ, బూత్, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు జిల్లా కమిటీలు, వాటి అనుబంధ సంఘాల కమిటీలను కూడాప్రకటించనున్నారు. గ్రేటర్ అధ్యక్షుడి ఎంపిక, జిల్లా నూతన కార్యవర్గాలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని పార్టీ అధిష్టానం ప్రకటించనున్నది.
కమిటీల విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పలు సూచనలు చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే కమిటీల్లో స్థానం దక్కనున్నది. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కచ్చితంగా 51 శాతం ఉండాలి. లేని పక్షంలో అయా కమిటీలు చెల్లవు. పార్టీ అనుబంధ కమిటీలతో పాటు బస్తీ, బూత్, డివిజన్, జిల్లా స్థాయి పార్టీ సోషల్ మీడియా కమిటీ ఏర్పాటుకు సూచనలు చేశారు. అన్ని కమిటీల్లో మహిళలకు తగిన చోటు కల్పించనున్నారు.
డివిజన్, బూత్, బస్తీ కమిటీల్లో దాదాపు తొమ్మిది రకాల అనుబంధ కమిటీలను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయనున్నారు. ఈ కమిటీల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జిలు పూర్తి బాధ్యత వహించనున్నారు. ప్రతి కమిటీలోనూ 15 మందికి తగ్గకుండా 33 మందికి మించకుండా సభ్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులు, మిగిలిన వారంతా కార్యవర్గ సభ్యులుగా ఉంటారు. బూత్ కమిటీలో కన్వీనర్తోపాటు 15 మంది వరకు సభ్యులు కొనసాగుతారు. డివిజన్, బూత్, బస్తీ కమిటీలకు సంబంధించి యువజన, మహిళా విభాగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపి మొత్తం తొమ్మిది అనుబంధ సంఘాలకు కమిటీలు వేయనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇంతకాలం నిమగ్నమైన శ్రేణులంతా ప్రస్తుతం పార్టీ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన ఈనెల 7న సర్వసభ్య సమావేశం జరగనున్నది. ఈనెల 12 తర్వాత బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీల ఏర్పాటులో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. రేపటి జెండా పండుగను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం . ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల 92 వేల సభ్యత్వాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించింది. పార్టీ సభ్యత్వాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తీసుకున్నారు. సీఎం కేసీఆర్పై ప్రజలకు పూర్తిగా విశ్వాసం ఉంది. అందుకు ఇదే నిదర్శనం . టీఆర్ఎస్ జెండా పండుగలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా.
కందుకూరు, ఆగస్టు 31 : సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు 2వ తేదీన గురువారం నిర్వహించే జెండా పండుగ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొని ప్రతి గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద పార్టీ జెండాను ఎగురవేయాలని సూచించారు.