బెంగళూర్ : కరోనా హాట్ స్పాట్ గా మారి నగర ప్రజలకు కంటికి మీద కునుకులేకుండా చేసిన మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. కేసుల సంఖ్య తగ్గడంతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య పడిపోవడం ఫలితంగా ఆక్సిజన్ పడకలకు డిమాండ్ అనూహ్యంగా తగ్గింది. మే 10 నుంచి బెంగళూర్ లో తాజా పాజిటివ్ కేసుల సంఖ్య దిగిరావడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
మే 17న 13,000 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మే తొలివారంతో పోలిస్తే వీటి సంఖ్య అత్యల్పం. ఏప్రిల్ 30 నుంచి మే 6 మధ్య 30.6 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు కూడా దిగివచ్చింది. గత వారం, పదిరోజుల కిందటి పరిస్థితితో పోలిస్తే బెంగళూర్ లో పడకల కొరత గణనీయంగా తగ్గుముఖం పట్టిందని రీగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూరిరాజు పేర్కొన్నారు.
ఆక్సిజన్ పడకలు సైతం రోగులకు సులభంగా దొరుకుతున్నాయని చెప్పారు. నగరంలో ఆక్సిజన్ పడకల సంఖ్య పెరగడం కూడా ఇందుకు ఓ కారణమని ఆయన చెప్పుకొచ్చారు. గత కొద్దిరోజులుగా మరణాల సంఖ్య కూడా తగ్గిందని స్మశాన వాటికలు, అంత్యక్రియల వద్ద పనిచేసే వాలంటీర్ల నుంచి వచ్చిన సమాచారం వెల్లడిస్తోంది.