విశ్వ వినువీధిలో కొత్త రేసు మొదలైంది. అపర కుబేరులైన ముగ్గురు వ్యాపారవేత్తల మధ్య నెలకొన్న రసవత్తర పోటీకి ముహూర్తం ఆసన్నమైంది. ‘రోదసి పర్యాటకం’లో కీలక మైలురాయిగా పిలుస్తున్న ‘వర్జిన్ గెలాక్టిక్’ మిషన్ను ఆదివారం ప్రయోగించనున్నారు. ఈ బృహత్తర ప్రయోగంలో తెలుగమ్మాయి శిరీష బండ్ల పాలుపంచుకుంటుండటం విశేషం.
వ్యాపార రంగంలో విజేతలుగా నిలిచిన దిగ్గజ వ్యాపారవేత్తలు వర్జిన్ గ్రూప్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ చూపు రోదసి పర్యాటకం వైపునకు మళ్లింది. ఆ రంగంలో కూడా విజయఢంకా మోగించాలన్న వారి ఆకాంక్షనే ప్రస్తుత పోటీకి ప్రధాన కారణంగా మారింది.
ముగ్గురూ ముగ్గురే!
వర్జిన్ గ్రూప్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్ టూరిజం పోటీకి తెరలేపారని చెప్పొచ్చు. వర్జిన్ సంస్థకు చెందిన ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష పరిశోధన సంస్థ పంపిస్తున్న మానవసహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ఆదివారం నింగిలోకి దూసుకుపోనున్నది. ఈ ప్రయోగం విజయవంతమైతే స్పేస్ టూరిజం కొత్త పుంతలు తొక్కే అవకాశమున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అనుబంధ సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ ఈ నెల 20న తన ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌకను రోదసిలోకి పంపనున్నది. అందులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా వెళ్తున్నారు. ఇంకోవైపు, ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ఎక్స్ సంస్థ తన ‘స్టార్షిప్’ ప్రాజెక్టు ద్వారా చంద్రుడు, అంగారకుడిపైకి మానవులను పంపాలనుకుంటున్నది. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
స్పెషల్ అట్రాక్షన్గా మన అమ్మాయి
‘వర్జిన్ గెలాక్టిక్’ ప్రయోగంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల పాలుపంచుకోనున్నారు. కల్పనా చావ్లా తర్వాత రోదసియానం చేయనున్న భారత మహిళగా.. రోదసిలోకి వెళ్తున్న తొలి తెలుగమ్మాయిగా ఆమె ఈ ఘనత సాధించనున్నారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలోని పరిశోధన అంశాలను ఆమె పర్యవేక్షించనున్నారు.