కంటోన్మెంట్, ఆగస్టు 26: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్, మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్రెడ్డిపై కంటోన్మెంట్ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ క్రమంలో కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లి, పికెట్, లాల్బజార్, డైమండ్ పాయింట్, అన్నానగర్ చౌరస్తాల్లో గురువారం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు రేవంత్ చిత్రపటంపై టమాటలతో దాడి చేశారు.
బోయిన్పల్లి చౌరస్తాలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారని, మంత్రిని పట్టుకుని ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఆర్టీఏ చట్టాన్ని అడ్డుపెట్టుకుని బెదిరంపులకు దిగుతున్నది ఎవరో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకం ఇంకా అమల్లోకి రాకముందే గగ్గోలు పెడుతున్నారని, అన్నప్రాసనం చేసిననాడే అవకాయ పెట్టలేదన్నట్లుగా రేవంత్ తీరు ఉందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డిపై నోరు పారేసుకుంటే పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి విపక్షాలకు నిద్ర పట్టడం లేదన్నారు. కార్యక్రమాల్లో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్, లోక్నాథం, ప్రభాకర్తో పాటు నేతలు ముప్పిడి మధుకర్, ప్రభుగుప్తా, అజయ్యాదవ్, రాజ్కుమార్సింగ్, మీనాభాస్కర్తో సహా టీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.