శంషాబాద్, ఏప్రిల్ 18: త్రిదండి చిన జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో భగవత్ రామానుజుల 1004వ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిసినవి. ఈ నెల 15న జీయర్ స్వామి వారు ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్ పరిధిలోని శ్రీ రామనగరంలో ఉన్న దివ్యసాకేత క్షేత్రంలో స్వామి పర్యవేక్షణలో ఆదివారం ముగింపు మహోత్సవాలు జరిగాయి. దివ్యసాకేతంలో స్వామివారి పెరుమాళ్లకు తిరువారాధన, సేవాకాలం కార్యక్రమాలు జరిపారు. ఆదివారం ఉదయం చిన జీయర్ స్వామివారిచే శ్రీ రామానుజ వైభవం ప్రవచనం, వసంత నవరాత్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి ప్రసంగిస్తూ ‘జీవిత లక్ష్యాన్ని వినయం, భగవంతుని శరణాగతి ఏ మేరకు అవసరమో రామానుజుల జీవితం, బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం’ అని ఉద్ఘాటించారు. ‘ఆయన వేసిన ప్రతి అడుగు సంఘాన్ని సంస్కరించే బాటలోనే సాగింది’ అని తెలిపారు.