మణికొండ, ఆగస్టు 26 : చెట్లను మనం రక్షిస్తే.. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గతంలో ఏదైనా పనికోసం చెట్లను కొట్టేసి పక్కకు పడేసివారు. వాటిన మళ్లీ నాటాలనే ఆలోచన తక్కువ ఉండేది. ఇప్పుడు ఎంతటి వృక్షాన్నయినా తిరిగి నాటి బతికించొచ్చు. రీ ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతో ప్రభుత్వం, ఇతర స్వచ్ఛందసంస్థలు, కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. ఓ వైపు జనాభా పెరుగుతుండడంతో రోడ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
దీని నివారణకు ప్రభుత్వం రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట చౌరస్తా నుంచి గండిపేట చౌరస్తా వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకిరువైపులా చెట్ల తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం 280 చెట్లు ఉండగా, వీటిలో కానుగ, గుల్మోహర్, సుబాబుల్, రావిచెట్టు, వేప చెట్లు అధికంగా ఉన్నాయి. వీటిలో తిరిగి బతికే గుణం ఉన్న 40 చెట్లను రీట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. చెట్టు చుట్టూ పెద్ద గుంత తవ్వి వాటికి తట్టు సంచులను కట్టి జేసీబీ సాయంతో వేర్లతో సహ పెకిలించి వేరే చోటకు తరలిస్తున్నారు. మణికొండలోని ల్యాంకోహిల్స్ రహదారి విస్తరణలోనూ అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి మరోచోట నాటేలా చర్యలు ప్రారంభించారు.
నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న పెద్ద చెట్లను తిరిగి మరోచోట బతికించేందుకు గండిపేటలోని డ్రీమ్ వ్యాలీ రిసార్టు ముందుకొచ్చింది. చెట్ల పెద్దవేర్ల వరకు కటింగ్ చేసి కొన్ని రసాయనాల మిశ్రమాన్ని పూసి జేసీబీల సహాయంతో తొలగించి రిసార్టుకు తరలిస్తున్నారు.