హైదరాబాద్ : పన్ను ఎగవేస్తూ హైదరాబాద్లో యథేచ్ఛగా తిరుగుతున్న లగ్జరీ కార్ల యజమానులపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఆర్నెళ్లుగా నిఘా పెట్టి, పక్కా ప్రణాళిక ప్రకారం ఇవాళ ఉప రవాణా కమిషనర్ డాక్టర్ కే పాపారావు ఆధ్వర్యంలో 40 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు, మోటర్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. రాష్ట్రానికి పన్ను చెల్లించకుండా తిరుగుతున్న 11 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాల ద్వారా రూ. 5 నుంచి 8 కోట్లు పత్యక్షంగా.. రూ. 100 కోట్లు పరోక్షంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన వాటిలో మెర్సిడెజ్ బెంజ్, మాసరట్టి, పెర్రారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గీని తదితర కంపెనీలకు చెందిన కోట్ల ఖరీదైన కార్లులున్నాయి.
ఈ సందర్భంగా ఉప రవాణా కమిషనర్ డాక్టర్ కే పాపారావు మాట్లాడుతూ… ఇతర రాష్ట్రాల నుంచి హైఎండ్ లగ్జరీ కార్లు కొన్న యజమానులు రాష్ట్రానికి రావాల్సిన పన్ను చెల్లించాలని కోరారు. పన్ను చెల్లించకుండా తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రవాణా శాఖ చరిత్రలో ఇలాంటి దాడులు జరగడం ఇదే తొలిసారి. శ్రీమంతులు, పలుకుబడి ఉన్న వారు వినియోగించే వాహనాలను సీజ్ చేయడంపై పలువురు రవాణాశాఖ అధికారులను ప్రశంసిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.