“ఆనంద్ అనే వ్యక్తి బంజారాహిల్స్ నుంచి తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఖైరతాబాద్ చౌరస్తా వద్ద తనకు తెలిసిన వ్యక్తి కనిపించాడు. అతడిని తన వాహనంపై కూర్చోబెట్టుకొని బషీర్బాగ్ వైపు వెళ్లాడు. సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో వెనుక కూర్చున్న వ్యక్తికి మాస్క్, హెల్మెట్ లేకపోవడంతో యజమానికి రెండు జరిమానాలు పడ్డాయి.
అందుకే లిఫ్ట్ ఇచ్చే సమయంలోనూ, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వారు, బంధువులను వాహనంపై తీసుకెళ్తున్నా..వారు మాస్క్,హెల్మెట్ తప్పని సరిగా ధరించే విధంగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలనినగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వాహనదారుడి ప్రాణరక్షణకు హెల్మెట్ నిబంధనలు పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధన కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నారు. పిలియన్ రైడర్కు హెల్మెట్ లేకుంటే చలాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అతడికి హెల్మెట్ లేకుంటే యజమానికే జరిమానా పడుతుంది.
ప్రస్తుతం 99 శాతం మంది ద్విచక్రవాహనదారులు హెల్మెట్ను ఉపయోగిస్తున్నారు. అయితే బైక్ వెనుక కూర్చున్న వారు కూడా ధరిస్తేనే పూర్తిస్థాయిలో ప్రాణనష్టం జరుగకుండా ఉంటుంది. అందుకే రెండేండ్లుగా పిలియన్ రైడర్స్పై కూడా ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టి, వాహనం వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై గతేడాది నుంచి చలాన్లు విధిస్తున్నారు.
ఇక కరోనా తగ్గిందని.. మాస్క్ను వదిలేశారా..? మీపై నిఘా కండ్లు పనిచేస్తున్నాయని మరిచిపోవద్దు.. ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీసులు మాస్క్ లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. జరిమానా పడిందంటే రూ.వెయ్యి కట్టాల్సిందే. వాహనం నడుపుతున్న వ్యక్తికే కాదు.. వెనుక కూర్చున్న వారికి సైతం మాస్క్ మస్ట్. కరోనాను అరికట్టేందుకు మాస్క్ తప్పనిసరి అంటూ.. ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. మాస్క్లు ధరించడం వల్ల వైరస్ వ్యాప్తి అరికట్టే అవకాశముంటుందని, ప్రతి ఒక్కరూ ధరించాలని సూచించింది.
అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలా మంది మాస్కులు పెట్టుకోవడం మరిచిపోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నాన్ కాంటాక్ట్ పద్ధతిలో చలాన్లు విధిస్తున్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు పిలియన్ రైడర్కు మాస్క్ లేకున్నా జరిమానాలు పడుతున్నాయి. ఐటీఎంఎస్(ఇంటలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా కూడా ఉల్లంఘనదారులకు చలాన్లు జారీ అవుతున్నాయి.
ఇంట్లో రెండు హెల్మెట్లు సమకూర్చుకోవడం తప్పని సరిగా మారుతున్నది. ఎవరికైనా ద్విచక్రవాహనం ఇచ్చినప్పుడు అతడు హెల్మెట్ పెట్టుకోకుంటే చలాన్ పడితే వాహన యజమానే చెల్లించాల్సి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చినప్పుడు, వాహనంపై ఇతరులను ఎక్కించుకున్నప్పుడు హెల్మెట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చలాన్ పడటం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిందని పోలీసులు సూచిస్తున్నారు.