సిటీబ్యూరో, సెప్టెంబరు 3(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ట్రాఫిక్ జంక్షన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 221 ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు నూతనంగా 155 ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.59 కోట్లను ఖర్చు చేయనున్నది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికల్లా ఈ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 221 చోట్ల ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. హైదరాబాద్ పరిధిలో 155, సైబరాబాద్ పరిధిలో 41, రాచకొండ పరిధిలో 25 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయి. వీటికి సాంకేతికత జోడించి, ఆటోమెటిక్గా పని చేసేలా జీహెచ్ఎంసీ అధికారులు చూస్తున్నారు. వీటికి అదనంగా 155 ట్రాఫిక్, 100 ఫెలికాన్ (పాదచారుల) సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక నూతనంగా హైదరాబాద్ పరిధిలో 80, సైబరాబాద్ పరిధిలో 50, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 ట్రాఫిక్ సిగ్నళ్ల పనులను అధికారులు చేపట్టారు. కెనడాకు చెందిన ఐబీఐ గ్రూప్కు ఈ ప్రాజెక్టు పనుల బాధ్యతలను అప్పగించారు. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా ట్రాఫిక్ సూచికల బోర్డులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్ జోన్, లెఫ్ట్, రైట్ ఇలా ఇప్పటి వరకు 1300 చోట్ల ట్రాఫిక్ సైన్బోర్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.