బన్సీలాల్పేట్, మార్చి 2 : దేశ జనాభాలో రెండు శాతం చిన్నపిల్లలు, యాభై శాతం వృద్ధుల్లో వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయి. తొలిదశలోనే చిన్నారుల్లో వినికిడి సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈఎన్టీ వైద్యులు అంటున్నారు. వినికిడి సమస్యలు ఉన్న చిన్నారులకు చేయూతనిచ్చేందుకు పద్మారావునగర్లోని మీనాక్షి వెంకటరామన్ ఫౌండేషన్ (ఎంవీఎఫ్) వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అండగా నిలుస్తున్నది.
2013లో ఏర్పాటైన తమ ఎంవీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గాంధీ దవాఖాన, సుల్తాన్ బజార్, నీలోఫర్, ప్లేట్లబుర్జ్ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన, రాణిగంజ్, భోలక్పూర్, పాన్బజార్, సీతాఫల్మండీల్లోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నవజాత శిశువులకు ఉచితంగా వినికిడి సమస్యలను గుర్తించే కేంద్రాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని మేనేజింగ్ ట్రస్టీ సేతురామన్ తెలిపారు. ఇప్పటివరకు 1.8 లక్షల మంది చిన్నారులకు స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. ప్రతి ఏడాది 200 మంది పేదలకు పలువురు దాతల సహకారంతో వినికిడి యంత్రాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.
ఎంవీఎఫ్లో సేవలన్నీ ఉచితమే
వినికిడి సమస్యలు ఉన్న చిన్నారులను గుర్తించాక వారి తల్లులకు, పిల్లలకు పద్మారావునగర్లోని ఎంవీఎఫ్ సిటీ సెంటర్లో ఆరు నెలల పాటు ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి12 గంటల వరకు స్పీచ్ థెరపీ ద్వారా పిల్లలకు సైగలను వివరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల అవసరాలను ఎలా గుర్తించాలి, వారి స్పందనలు ఎలా తెలుసుకోవాలో శిక్షణ ఇస్తున్నారు. ఎవరైనా పిల్లలు వినికిడి సమస్యలతో బాధపడుతుంటే పద్మారావునగర్లోని సిటీ సెంటర్కు నేరుగా రావచ్చని, ఇతర వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 040-4917 0777లో సంప్రదించాలని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రంగనాథన్ తెలిపారు.
కూతురు చికిత్స కోసం వచ్చి టీచర్గా మారాను
మేము బడంగ్పేట్లోని అల్మాస్ గూడలో ఉంటాము. ఇంటర్ చదువుతున్న మా కూతురు సాయి పూజిత (16)కు బాల్యం నుంచి మాటలు రాలేదు. కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో ఆపరేషన్ చేసి చెవిలో కాక్లియర్ యంత్రాన్ని అమర్చారు. కొన్నాళ్లకు అదీ పాడైపోయింది. ఇక్కడకు వచ్చి నేను ఎంవీఎఫ్ సంస్థలో టీచర్గా చేరి అనేకమంది తల్లులకు శిక్షణ ఇస్తున్నాను. ఇప్పుడు నా కూతురు సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
– పూజిత తల్లి స్వప్న
నా కుమారుడు ఇప్పుడు స్పందిస్తున్నాడు
మేము ఇబ్రహీంపట్నంలో ఉంటాం. మా బాబుకి ఏడేండ్ల వయస్సు వచ్చినా మాటలు రాకపోవడంతో గాంధీ దవాఖానలో పరీక్షలు చేయించగా వినికిడి సమస్య ఉన్నట్టు తెలిసింది. వారు మీనాక్షి ఫౌండేషన్కు సిఫారసు చేశారు. అక్కడ బాబును పరీక్షించి ఆరు నెలలుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు నా కుమారుడు చాలా బాగా స్పందిస్తున్నాడు.
– మయూరి, మేధాంశ్ తల్లి