Digestive problems | ‘హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో తయారయ్యే వివిధ రకాల ఆహారంతో జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి.పొట్ట నిబ్బరం, నొప్పి, విరేచనలు, వాంతులు.. ఇలా చెప్పుకుంటూపోతే బోలెడన్ని సమస్యలు. అయితే ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరినీ వేదించేవే అయినా.. నిర్లక్ష్యం చేస్తే తిరిగి సరిదిద్దలేని శాశ్వత సమస్యలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల పేగు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. ఈనెల 29న ‘ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినం’ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.’
సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ) : గుండె, మూత్ర పిండాలు, కాలేయం తదితర ప్రధాన అవయవాల గురించి, వాటికి దాపురించే వ్యాధుల గురించి ప్రజలకు ఎంతోకొంత అవగాహన ఉంది. కానీ.. పొట్టలో కీలక పాత్ర పోషిస్తూ, ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు శరీరంలోని అవయవాలకు శక్తిని అందించే పేగుల విషయంలో మాత్రం కనీస పరిజ్ఞానం కరువవుతున్నది. ఫలితంగా పేగులకు సంబంధించిన వ్యాధులు పెరిగిపోయి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
జంక్ఫుడ్లో ప్రమాదం..
జంక్ఫుడ్లో వాడే పదార్థాలు, అవి తయారయ్యే విధానం.. రెండూ ఆరోగ్యానికి హాని కలిగించేవే. పదేపదే మరిగించే నూనెలో ట్రాన్స్ఫ్యాట్స్ తయారై శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచడంతోపాటు జీర్ణ వ్యవస్థకు, గుండెకు చేటు చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల పేగు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి..
పేగు సమస్యలకు కారణమైన మల బద్దకం, హైపర్ ఎసిడిటీ, డయేరియా వంటివి 30శాతం మంది పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి యేటా 3లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు అతిసారంతో చనిపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ కారణంగా జీర్ణ సమస్యలను నివారించేందుకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల పేగు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూడడంతోపాటు శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, ప్రోబయోటిక్లను ఎంచుకోవడం వంటివి పిల్లల పేగు ఆరోగ్యాన్ని పెంచేందుకు దోహదపడుతాయి. తగినంత నీరు తీసుకోవడంతోపాటు బయటకు వెళ్లి ఆడుకునేలా ప్రోత్సహించడం వల్ల పేగు ఆరోగ్యానికి ఉపయుక్తంగా ఉంటాయని చిన్నపిల్లల వైద్యులు పేర్కొంటున్నారు.
సమతుల్య ఆహారం అందించాలి
తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు సమతుల్య ఆహారం అందించాలి. జీర్ణ రుగ్మతల కోసం తీసుకునే మందుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. యాంటీబయాటిక్స్ వాడడం వల్ల జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాలు చనిపోతాయి. వాటిని తిరిగి పొందడానికి 60 ఏళ్లు పడుతుంది. రోటా వైరస్, మీజిల్స్ వ్యాక్సిన్లతో సహా పిల్లలకు సరిగ్గా టీకాలు వేయించడం ముఖ్యం. ఇది డయేరియాను నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు సొంత వైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం అవసరం.
– డాక్టర్ పవన్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, ఒమేగా క్లినిక్, హైదరాబాద్.