న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ కరోనా.. దేశంలో తీవ్ర భయభ్రాంతులు కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విదేశీ కోవిడ్ టీకాలను అనుమతు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇతర దేశాల్లో అత్యవసర వినియోగం కోసం అనుమతి దక్కిన టీకాలకు ఇక్కడ కూడా ఆమోదం తెలుపనున్నట్లు ఇవాళ కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు.. స్వదేశీ వినియోగం కోసం విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం చెప్పింది.
కోవిడ్ నియంత్రణలో వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ చాలా క్లిష్టమైందని, ప్రస్తుతం కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అత్యవసరం వినియోగం(ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్, ఈయూఏ) కోసం ఆమోదం దక్కిందని, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) ఆ టీకాల వినియోగం కోసం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రం ఇవాళ తన ప్రకటనలో తెలిపింది. అయితే ఇండియాలోని నిపుణలు కమిటీ తాజాగా చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం పచ్చజెండా ఊపింది. విదేశాల్లో అభివృద్ధి చేసి, అక్కడే ఉత్పత్తి అవుతున్న టీకాలను కూడా మనం అత్యవసరంగా వినియోగించుకోవచ్చు అని కమిటీ సూచించింది. అమెరికా, యూరోప్, బ్రిటన్, జపాన్ దేశాల్లో వాడుతున్న టీకాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన జాబితాలో ఉన్న టీకాలకు ఇండియాలో అత్యవసర అమనుతి ఇవ్వనున్నారు.
రష్యా ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్ వీ టీకాకు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పరిమిత ఆంక్షలతో ఆ టీకాను భారత్లో వాడనున్నారు. భారత్లో వినియోగానికి అనుమతి పొందిన తొలి విదేశీ టీకా ఇదే కావడం విశేషం.