సిటీబ్యూరో, జులై 10 (నమస్తే తెలంగాణ): ఆలస్యంగా పెండ్లి చేసుకున్నా..పిల్లలకు జన్మనిచ్చినా.. సంబంధిత మహిళలకు క్యాన్సర్ ముప్పు అధికంగా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. సఖీ హెల్త్ అండ్ వెల్బీయింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళల్లో సాధారణంగా వచ్చే సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎనీమియా వ్యాధులపై శనివారం ఉచిత అవగాహన సదస్సు మియాపూర్లోని కౌసల్య కాలనీలోని ఎస్ఎల్జీ దవాఖానలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎల్జీ దవాఖాన కన్సల్టెంట్ అబ్స్ట్రేషియన్ గైనకాలజిస్టు డాక్టర్ శిరీషా, కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్టు డాక్టర్ స్వర్ణకుమారి హాజరయ్యారు. వ్యాధుల పట్ల మహిళలకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈసందర్భంగా డాక్టర్ స్వర్ణ కుమారి మాట్లాడుతూ.. మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్లు సాధారణమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులో వివాహాలు, ఎక్కువ సంఖ్యలో పిల్లలు.. వంటి పలు కారణాల వల్ల గర్భాశయ క్యాన్సర్ వస్తుందన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. అనంతరం డాక్టర్ శిరీషా మాట్లాడుతూ ఎదిగిన పిల్లల్లో హార్మోన్ల సమతుల్యత లోపించి అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. పిల్లలను జంక్ఫుడ్కు దూరంగా ఉంచాలన్నారు. సదస్సులో మహిళలు పాల్గొన్నారు.