కవాడిగూడ : ముషీరాబాద్ నియోజకవర్గంలో 11 వేల కొత్త రేషన్కార్డులు మంజూరు అయ్యాయని, కార్డులు పొందిన లబ్ధిదారులకు ఈనెల నుంచి రేషన్ సరుకులు అందజేస్తారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. రేషన్ కార్డులు లేనివారు ధరఖాస్తు చేసుకున్నట్లైతే వారికి కార్డులు వచ్చే విధంగా చూస్తానని ఆయన పేర్కొన్నారు. గురువారం భోలక్పూర్ డివిజన్లోని దేవునితోటలో గల శ్రీ భవానీశంకర్ దేవాలయంలో బోనాలపండుగ సందర్భంగా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బోనాల పండుగ ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో మూడో విడతగా మంజూరి అయిన 17 వేల చెక్కులను ఆయా ఆలయాల చైర్మన్లకు అందజేశారు. బోనాల పండుగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భోలక్పూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్ రావు, శ్రీ భవానీశంకర్ దేవాలయం చైర్మన్ ఆర్. శ్రీనివాస్, శ్రీ లక్ష్మీగణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు గోవింద్ రాజ్, డి. శివ ముదిరాజ్, అనిల్ కుమార్, కేఎం సాయి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.