14 రోజుల కిందట జీడిమెట్లలోని మనీట్రాన్స్ఫర్ సంస్థలో దోపిడీ
తప్పించుకుని తిరుగుతూనే… మరోసారి పంజా
పోలీసుల అదుపులో ఒకరు!.. పరారీలో మరొకరు
సస్పెన్స్ వీడిన కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ కాల్పుల ఘటన
కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద జరిగిన దోపిడీ మిస్టరీ వీడిపోయింది. కాల్పులకు పాల్పడింది.. ఇద్దరు పాత నేరస్తులని తేలింది. ఈ ఘటనలో పాల్గొన్న ఇద్దరిలో ఒకరు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఈ ఇద్దరు గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారని తెలిసింది. ఆ తర్వాత ఏప్రిల్ 16న జీడిమెట్ల పరిధిలో ఓ మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో తుపాకీతో బెదిరించి రూ.1.9 లక్షలు దోచుకున్నారు. ఆ సమయంలో ఆచూకీ లభించకుండా మొబైల్ ఫోన్ను మరోచోట పడేసినట్లు పోలీసులు గు ర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తుండగా గురువారం మధ్యాహ్నం 1.50 నిమిషాలకు కూకట్పల్లి పటేల్కుంట విజయ్నగర్ కాలనీలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో కస్టోడియన్ శ్రీనివాస్, సెక్యూరిటీ గార్డు అలీ బేగ్పై కాల్పు లు జరిపి ఐదు లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు అలీ బేగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసు అధికారులు దాదాపు 12 బృందాలను ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల అధ్యయనంతో దుండగుల ఆచూకీ తెలిసిపోయింది. అంతేకాకుండా పోలీసులు అతి వేగంగా స్పందించడంతో దుండగుల్లో ఒకరు నగరంలోనే దొరికిపోయాడు. మరొక దుండగుడు తుపాకీ, డబ్బుతో పరారైయినట్లు సమాచారం. ఇద్దరిలో ఒకరు బిహార్కు చెందినవాడు కాగా, మరో దుండగుడు మహారాష్ట్ర నాందేడ్కు చెందినవాడని తెలుస్తోంది. జీడిమెట్ల దోపిడీలో పరిచయం ఉన్న వ్యక్తి బైక్ను వాడగా.. గురువారం జరిగిన ఘటనలో చోరీ బైక్ను వాడినట్లు తెలిసింది. ఈ ఇద్దరు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి.. గత కాలంగా రోజువారి కూలీలుగా పని చేస్తున్నట్లు పోలీసు రికార్డులో ఉంది. మరో రెండు రోజుల్లో రెండో నిందితుడు దొరకగానే పోలీసులు దుండగులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు వివరాలను వెల్లడించేందుకు గోప్యతను పాటిస్తున్నారు.