ముసాయిదా జాబితాను విడుదల చేసిన అధికారులు
సర్పంచ్, ఎంపీటీసీతోపాటు నాలుగు వార్డులకు ఉపఎన్నిక
కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 3: ఉపఎన్నికల ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. కొల్లాపూర్ మండలంలో ఒక గ్రామ పంచాయతీకి, ఎంపీటీసీ, మరో నాలుగు వార్డులకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఉపఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు రెండు రోజులుగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. 4,783 ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను శనివారం విడుదల చేశారు. ఉపఎన్నికల్లో భాగస్వాములయ్యే గ్రామాల్లో వీటి ప్రతులను అభ్యంతరాల నిమిత్తం ఓటర్లకు అందుబాటులో ఉంచారు. శాసనసభ ఎన్నికలప్పటి ఓటరు జాబితాను అనుసరించి జనవరి 15వతేదీ వరకు ఓటుహక్కు నమోదు చేసుకున్న వారితో కలిపి అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేశారు.
సింగోటం ఎంపీటీసీకి ఉప ఎన్నిక
టీఆర్ఎస్ దివంగత నాయకుడు రత్నప్రభాకర్రెడ్డి సతీమణి సుధారాణి రెండు స్థానాలకు రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. మొదట మాచినేనిపల్లి సర్పంచుగా ఎన్నికైన గాదెల సుధారాణి ఆ తర్వాత నిర్వహించిన మండల ప్రాదేశిక ఎన్నికల్లో సింగోటం గ్రామం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై మండల పరిషత్ అధ్యక్ష పదవి చేపట్టారు.దీంతో మాచినేనిపల్లి సర్పంచ్కు రాజీనామా చేశారు. ఆ తర్వాత తన భర్త రత్నప్రభాకర్రెడ్డి రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని సింగోటం ఎంపీటీసీ, ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో సింగోటం ఎంపీటీసీ స్థానం ఖాళీ అయ్యింది. ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఓటర్ల జాబితాపై దృష్టిపెట్టి ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ ఉపఎన్నికల్లో మొత్తం 4,783 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మాచినేనిపల్లిలో 628ఓట్లు
మాచినేనిపల్లి గ్రామ పంచాయతీలో 628 మంది ఓటర్లున్నారు. అలాగే సింగోటం ఎంపీటీసీ స్థానానికి సింగోటం, మాచినేనిపల్లి, జావాయిపల్లి గ్రామస్తులు ఓటును హక్కును వినియోగించుకోనున్నారు. మాచినేనిపల్లిలో సర్పంచ్, ఎంపీటీసీకి రెండు ఓట్లు వేయాల్సి ఉంది. జావాయిపల్లి, సింగోటంలో మాత్రం కేవలం ఎంపీటీసీ స్థానానికి ఒక ఓటరు ఒకే ఓటును వినియోగించుకోవాలి. సింగోటంలో 2,592 ఓటర్లుండగా జావాయిపల్లిలో 638, మాచినేనిపల్లిలో 628 మంది ఓటర్లున్నారు. అలాగే మండలంలోని కుడికిళ్ల గ్రామ పంచాయతీలో ఉప ఎన్నిక జరుగనున్న 6వ వార్డుకు 312 ఓట్లు, లచ్చనాయక్ తండాలో 5వ వార్డుకు 93, ఎల్లూరులోని 5వ వార్డుకు 250, 7వ వార్డుకు 270 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఇవికూడా చదవండి..
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
సాగర్ ఉప ఎన్నిక : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
సాగర్లో టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ప్రచారం