సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ): సాగరతీరంలో అద్భుతమైన థీమ్ పార్కుగా థ్రిల్సిటీ గుర్తింపు పొందడం ఖాయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాత్రి హుస్సేన్సాగర్ తీరంలోని పీ.వీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో కూడిన థ్రిల్ సిటీ థీమ్ పార్కును హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించేలా థ్రిల్ సిటీ థీమ్ పార్కును నిర్మించారన్నారు. థ్రిల్ సిటీ డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ థ్రిల్ సిటీలో ప్రధానంగా రైడింగ్ మాన్స్టర్ థియేటర్, స్లాస్ కోస్టర్, ఫ్లైయిట్ సిమ్యులేటర్, స్కోడా కారు డ్రైవర్, ట్రైనింగ్ సిమ్యులేటర్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, మ్యాజిక్ ట్రైయిన్, హర్స్ రంగుల రాట్నం ఇలా రకరకాల గేమింగ్స్ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సుభాశ్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, హెచ్ఎండీఏ మాజీ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, థ్రిల్ సిటీ డైరెక్టర్ రజనీకాంత్ పాల్గొన్నారు.