సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): భారీ చోరీకి పాల్పడిన నేపాల్ దంపతులు..దేశం దాటకుండా సైబరాబాద్ పోలీసులు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. రెండ్రోజుల కిందట రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని టెలీకాంకాలనీలోని వ్యాపారి గోవింద్రావు ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదును ఎత్తుకెళ్లిన నేపాలీ దంపతులు లక్ష్మణ్, పవిత్ర దేశం దాటకుండా.. పోలీసులు అడ్డుకట్ట వేశారు. దీంతో నిందితులు పోలీసు నిఘాకు భయపడి ముంబైలోనే తిరుగుతున్నట్లు సమాచారం. రాయదుర్గం నుంచి క్యాబ్లో వెళ్లిన వీరు.. ముంబైకి చేరుకుని అక్కడి నుంచి విమానంలో నేపాల్కు చెక్కేద్దామని స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తున్నది. దీని కోసం వారు విమానాశ్రయం వద్ద తచ్చాడినట్లు పోలీసులకు సమాచారం లభించింది. అంతకుముందు చోరీ చేసిన సొత్తును ముంబైలో అమ్మేందుకు పలు ప్రాంతాల్లో నిందితులు సంచరించినట్లు పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అంతేకాకుండా వీరికి సహకరించిన మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.