హయత్నగర్, సెప్టెంబర్ 21 : జల్సాలకు అలవాటుపడిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ లాప్టాప్ల చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుం చి రూ.5 లక్షల విలువైన 16 లాప్టాప్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పురుశోత్తంరెడ్డి వివరాలు వెల్లడించారు. భద్రాచలం, జగదీశ్కాలనీకి చెందిన గుడికాని నవీన్కుమార్(41) ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పథకం రూపొందించాడు. రాత్రిపూట బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల వద్ద లాప్టాప్లు, సెల్ఫోన్లు అపహరించి రిపేర్ షాపుల్లో వాటిని విక్రయిస్తుంటాడు.
దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ఏరియాల్లో నిందితుడు నవీన్కుమార్ పలు ట్రావెల్స్ బస్సుల్లో లాప్టాప్లను దొంగిలించాడు. పనామా చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నవీన్కుమార్ను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు, వనస్థలిపురం పోలీసులు కలిసి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించా డు. అతడి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువైన 16 లాప్టాప్లు, 5 సెల్ఫోన్లు, 2 పవర్ బ్యాంక్స్, 1 వ్రి స్ట్ వాచ్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్లు మహేశ్, సత్యనారాయణ, జగన్నాధ్, సిబ్బంది పాల్గొన్నారు.