సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయాల్లో దుకాణాల షట్టర్ తాళాలు పగలగొట్టి నగదు దోచేస్తున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ షాపులో దొంగతనం జరిగింది. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్ పరిసరాల్లోని సీసీ కెమెరాలు, దొంగతనం జరిగిన తీరును పరిశీలించి.. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనిగా గుర్తించి.. ఆ దిశగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నారు.
టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. బీహార్కు చెందిన షేక్ మసిరుద్దీన్ ఢిల్లీలోని చాందిని చౌక్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తుంటాడు. అక్కడే బీహార్కు చెందిన మహ్మద్ ఆజాద్, పర్వీజ్ అలాం, మహ్మద్ జావేద్, మహ్మద్ అక్తర్ హుస్సేన్ చిరు వ్యాపారులు చేసుకుంటున్నారు. షేక్మసీరుద్దీన్ వీరందరితో కలిసి ముఠాను ఏర్పాటు చేసి..నగరాల్లో తిరుగుతూ.. అవకాశం చిక్కిన చోట దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలోనే గత నెల 2న రైలులో ఈ గ్యాంగ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చింది. సికింద్రాబాద్ పరిసరాల్లో ఆశ్రయం పొందిన నిందితులు.. కట్టర్, ఐరన్రాడ్,స్క్రూ డ్రైవర్లు కొన్నారు. మార్కెట్ ప్రాంతంలో తిరుగుతూ.. రెక్కీ నిర్వహించారు. డైమండ్ హౌస్ హోల్సేల్ గ్రోసరీ స్టోర్ను లక్ష్యంగా ఎంచుకొని.. గతనెల 25న ఆ దుకాణం షట్టర్ తాళాలను పగలగొట్టి దోచుకున్నారు. తెల్లవారుజామున కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి కేరళకు వెళ్లారు.
అక్కడి కాసర్గడ్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు చేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. సిటీలో జరిగిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన నార్త్జోన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం నిందితుల కోసం గాలింపు చేపట్టింది. మరోసారి ఈ గ్యాంగ్ దొంగతనం చేసేందుకు నగరానికి వచ్చి.. సికింద్రాబాద్ ప్రాంతంలో తిరుగుతుండగా, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని విచారించడంతో నేరలా చిట్టా బయటపడింది. ప్రధాన నిందితుడిపై గతంలో సైబరాబాద్ ఠాణా పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి. ముఠా నుంచి రూ.3 లక్షల నగదు, ఐదు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను మార్కెట్ పోలీసులకు అప్పగించారు.