బంజారాహిల్స్, సెప్టెంబర్ 14 : బెట్టింగ్ల కోసం చోరీకి పాల్పడిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, డీఎస్ఐ హరీశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం అనంతపురం గ్రామానికి చెందిన చింతరాజు(26) డిగ్రీ పూర్తిచేశాడు. నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ కార్మికనగర్లో నివాసముంటున్నాడు. రాజుకు ఆన్లైన్ బెట్టింగ్ల వ్యసనం తీవ్రంగా ఉంది. వచ్చిన జీతంతోపాటు అప్పులు చేసి మరీ బెట్టింగ్లు ఆడుతూ తీవ్రంగా నష్టపోయాడు. కాగా డిగ్రీలో తనతో పాటు చదువుకున్న జ్యోతి(25) అనే మహిళతో రాజుకు స్నేహం ఉంది.
రహ్మత్నగర్లో నివాసముంటున్న జ్యోతి వద్దకు మే నెలలో వెళ్లిన రాజు తనకు అర్జెంట్గా డబ్బులు అవసరం ఉందని, తన తల్లికి డయాలసిస్ చేయించడంతో పాటు అప్పులున్నాయంటూ నమ్మించాడు. ఎలాగైనా సరే డబ్బులు కావాలని ఒత్తిడి చేశాడు. దాంతో తన ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న సోదరి వరసయ్యే విజయ ఇంట్లో చోరీ చేయాలని ఇద్దరూ కలిసి ప్రణాళిక వేసుకున్నారు. అప్పటికే విజయ తల్లి అనసూయతో కలిసి ఇంటికి తాళం వేసి సొంతూరుకు వెళ్లింది. ఇంటిని చూస్తుండాలని విజయ చెప్పింది.
ఇదే అదునుగా భావించిన జ్యోతి, రాజు ఇద్దరూ కలిసి విజయ ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలోని ఆభరణాలు తస్కరించారు. ముత్తూట్ ఫైనాన్స్లో తనఖా పెట్టిన రాజు రూ.4లక్షలు తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్స్లో పెట్టి నష్టపోయాడు. కాగా ఇటీవల విజయ సొంతూరునుంచి తిరిగి వచ్చి చూడగా ఆమె ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెక్నాలజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న చింతరాజును అరెస్ట్ చేసి అతడి వద్దనుంచి తనఖా పెట్టిన 25తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడికి సహకరించిన జ్యోతి పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.