కార్వాన్ : కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురైన సంఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి. సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాళ్ళగడ్డ తాలీం అమ్లాపూర్ బస్తీలో నివపించే అలీ హుస్సేన్ ఖాన్ (65) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు. కాగా ఇతని పెద్ద కొడుకు అమ్జద్ అలీ ఖాన్ (35)కు తండ్రితో తరచు గొడవలు జరిగేవి.
ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి చిన్న కొడుకు, కోడలు మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో అలీ హుస్సేన్ ఖాన్ వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే తండ్రి పై ద్వేషంతో ఉన్న పెద్ద కొడుకు అమ్జజ్ అలీ ఖాన్ ఈ గొడవను సాకుగా తీసుకొని సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో తండ్రి అలీ హుస్సేన్ ఖాన్ పై ఇనుపరాడుతో దాడి చేసి కాళ్ళు, తల పై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం తన తండ్రి కాలు జారి బాత్రూంలో పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు తన బావ మఖ్బూల్కు సమాచారం అందించాడు. కాగా బాధితుడిని ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించగా వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు మృతుడి రెండో కుమారుడిని ప్రశ్నించగా తన అన్న అమ్జద్ దాడి చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.