అధికారుల చొరవతో మారిన ఎస్ఆర్టీ పార్కు రూపురేఖలు
కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
ముషీరాబాద్, ఏప్రిల్ 22: రాంనగర్ డివిజన్ ఎస్ఆర్టీ పార్కు పచ్చిక బయళ్లతో కొత్త శోభను సంతరించుకున్నది. పచ్చిక బయళ్లు, ఏపుగా పెరిగిన మొక్క లు, చెట్లుతో స్థానికులను ఆకట్టుకుంటున్నది. చాలా ఏండ్ల తరువాత ఉద్యానవన శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎస్ఆర్టీ కాలనీ పార్కును సుందరంగా తీర్చిదిద్దండతో ఎస్ఆర్టీ కాలనీకి కొత్త శోభ సంతరించుకుంది. ఉద్యానవన శాఖ అధికారులు ఎస్ఆర్టీ పార్కు అభివృద్ధి పట్ల ప్రత్యే చొరవ చూపడంతో పార్కు రూపు రేఖలు మారిపోయాయి. గతంలో పచ్చిక కానరాక, మొక్కలు, ఫుట్ పాత్ నిర్మాణం లేక కళావిహీనంగా ఉన్న పార్కును సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గత ఏడా ది క్రితం మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరగడంతోపాటు పచ్చిక ఏర్పాటు చేయడంతో ఎస్ఆర్టీ పార్కు స్థానికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. పార్కులో పచ్చదనం కొనసాగేలా ప్రత్యేక నీటి వసతి కల్పించి నిర్వహణను గాడిలో పెట్టారు. అంతేకాకుండా పార్కులో స్థానికులు వాకింగ్ చేసేలా ప్రత్యేక ఫుట్ పాత్ నిర్మాణం, కూర్చోవడానికి బల్లలు, మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేసిన అధికారులు పార్కు రోజు వారీనిర్వహణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఎస్ఆర్టీ పార్కు పచ్చని తోరణంలా దర్శనమిసున్నది. ఇక పార్కులో వర్షపు నీరు బయటికి వెళ్లకుండా భూమిలోకి ఇంకిపోయేలా ప్రత్యేకంగా ఇంకుడు గుంతలు సైతం ఏర్పాటు చేశారు. పార్కులో ఎటు చూసినా పచ్చదనంతో స్థానికులు, మార్నింగ్ వాకింగ్కు వచ్చేవారికి కనువిందు చేస్తున్నది. ఉద్యానవన శాఖ అధికారులు ఎస్ఆర్టీ పార్కును సుందరంగా తీర్చిదిద్దడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.