ఖైరతాబాద్, ఆగస్టు 27 : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగం సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ప్రజాడైరీ సమగ్ర మాసపత్రిక 21వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, లోగోను గవర్నర్ దత్తాత్రేయ, సినీనటుడు భానుచందర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు, నిర్మాత సి. కల్యాణ్, సుఖీభవ ప్రాపర్టీస్ అధినేత గురురాజ్, లయన్ ఎ. విజయ్కుమార్, నటుడు చంద్రకాంత్, మోటీవేషనల్ స్పీకర్, రచయిత ఆకెళ్ల రాఘవేంద్ర, మనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉప్పలపాటి శారద, ప్రజా డైరీ సంపాదకులు వి. సురేశ్తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అధునిక ప్రపంచంలో సాంతికేకంగా అభివృద్ధి చెందిన మీడియా రంగం ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలన్నారు. కరోనా సమయంలోనూ వెరువకుండా సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు పాటుపడ్డారని ప్రశంసించారు.
ప్రజాడైరీ సంపాదకులు సురేశ్ 21 సంవత్సరాలుగా పత్రికను నిర్వహించడంతో నేడు వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయమని, రానున్న రోజుల్లో దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం 21వ వార్షికోత్సవ కేక్ను కట్ చేశారు.