మియాపూర్ : సౌకర్యవంతమైన రహదారులు, పరిశుభ్రమైన తాగునీరు , మురుగుకు ఆస్కారం లేని డైనేజీ వ్యవస్థ , నిముషమైన అంతరాయం లేని విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగంలో నిలపటమే తన లక్ష్యమని ఇందుకోసం ప్రతినిముషం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులతో ప్రతి డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఆర్పీ కాలనీ, సుమిత్రనగర్, చైతన్యనగర్, ఆర్కే స్టీట్, వడ్డేపల్లి ఎన్క్లేవ్, ఆల్విన్ కాలనీ ఫేస్ 1, కమలా ప్రసన్ననగర్ కాలనీ, మాధవరం కాలనీ, వెంకటేశ్వరనగర్ 33, 34, 35 బ్లాక్లలో రూ.2,82, 10,000 వ్యయంతో నిర్మించనున్న యూజీడీ పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలిసి విప్ అరికెపూడి గాంధీ మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం తమ ప్రభుత్వం కోట్లాది రూపాలయను వెచ్చిస్తూ ఎన్నో వసతులను కల్పిస్తున్నదని, ఆ నిధులను సమర్థంగా ఉపయోగిస్తూ నియోజకవర్గాన్ని తాను సమగ్రంగా తీర్చిదిద్దు తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి,పెద్ద భాస్కర్రావు, మోజెస్, హరినాథ్, సాలయ్య, బాబూరావు, మహేశ్, వాసుదేవరావు, అంజిరెడ్డి, వేణు, చంద్రమోహన్, రాధాబాయి, స్వరూప, మురళి, ఆంజనేయులు , ఆయా కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.