జగిత్యాల : నర్సును వేధించిన అంశంలో వైద్యుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో మంగళవారం చోటుచేసుకుంది. డాక్టర్ సిహెచ్ రాజేశ్ కోరుట్ల పట్టణంలో లక్ష్మి ఆస్పత్రిని నడుపుతున్నాడు. వైద్యుడు తనని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ అదే ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అనుసరించి డీఎస్పీ గౌస్ బాబా మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. నర్సు చేసిన ఆరోపణలపై సిబ్బందిని విచారించారు. అనంతరం డాక్టర్ రాజేశ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.