బంజారాహిల్స్,ఆగస్టు 23 : జహంగీర్ పీర్ దర్గా వద్ద పీర్ల ఊరేగింపు చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హకీంపేటలో నివాసం ఉంటున్న అబ్దుల్ సమద్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి కొడుకు మహ్మద్ అర్మాన్(11) స్థానికంగా 6వ తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 18న అడుకుంటానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన అర్మాన్ , అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ మెహరాజ్(13) అనే బాలుడితో కలిసి షాద్నగర్ సమీపంలోని జహంగీర్ పీర్ దర్గాలో పీర్ల ఊరేగింపు చూసేందుకు వెళ్లారు. అయితే సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అన్ని ప్రాంతాల్లో గాలించిన తండ్రి సమద్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.