హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టు పూర్తి అయిందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కొవిడ్-19 తగ్గుముఖం అనంతరం సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం బుద్ధవనం ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. నాగార్జున సాగర్ చుట్టుపక్కల మౌళిక సదుపాయాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా పేర్కొన్నారు.
బుద్ధ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో బౌద్ధ సన్యాసులతో మంత్రి సంభాషించారు. అదేవిధంగా రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో కోటి లింగాల, నెలకొండపల్లి, దూలికట్టు, ఫనిగిరి వద్ద బౌద్ధ చారిత్రక ప్రదేశాలను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.