బంజారాహిల్స్,ఆగస్టు 12 : ఇల్లు మారే సమయంలో తాను వదిలిపెట్టిన ఎయిర్ కూలర్లు మాయమవడంపై ప్రశ్నించిన విదేశీ యువకుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యెమన్ దేశానికి చెందిన మహ్మద్ (25) 2017లో ఉన్నత విద్యకోసం నగరానికి వచ్చాడు. ఉస్మానియాలో బీకాం చదువుతున్న మహ్మద్ బంజారాహిల్స్ రోడ్ నెం 13లోని శ్రీరాంనగర్లో అరునెలలుగా గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 3న శ్రీరాంనగర్లోని గదిని ఖాళీ చేసిన మహ్మద్ హకీంపేట సమీపంలోని పారామౌంట్ కాలనీకి షిప్ట్ అయ్యాడు. ఇల్లు ఖాళీ చేసే సమయంలో రెండు ఎయిర్ కూలర్లను తన గది సమీపంలోని కిరాణాషాపు వద్ద పెట్టి వెళ్లాడు. కాగా వాటిని తీసుకువెళ్లేందుకు బుధవారం సాయంత్రం అక్కడకు వచ్చిన మహ్మద్కు కూలర్లు కనిపించలేదు. దాంతో కిరాణాషాపు నిర్వాహకుడు సయ్యద్ అహ్మద్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.
దీంతో ఇరువురి మద్యన మాటామాటా పెరిగింది. దాంతో ఆగ్రహానికి లోనయిన సయ్యద్ అహ్మద్తో పాటు స్థానిక యువకులు అక్కడకు వచ్చి మహ్మద్పై దాడికి దిగారు. కర్రలతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి దవాఖానలో చేరాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ 324 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడిలో పాల్గొన్న వారికోసం గాలింపు చేపట్టారు.