తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 17: తెలుగు భాషా సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్న కవి సుధామకు సాహితీ పురస్కారం అందించడం ముదావహమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ 40వ సంస్మరణ ప్రసంగం చేసిన ప్రముఖ కవి, విమర్శకులు సుధామకు సాహితీ పురస్కార ప్రదానోత్సవం పరిషత్తు ప్రాంగణంలోని ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనంలో సుధామ చేస్తున్న కృషిని రమణాచారి ప్రశంసించారు. కవిగా, వక్తగా, కార్టూనిస్టుగా, పత్రిక కాలమిస్టుగా, యువభారతి సంస్థలో ముఖ్యమైన కార్యకర్తగా కృషి చేస్తున్నారన్నారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ఓయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షురాలు డాక్టర్ పి.సుమతీ నరేంద్ర అమ్మమ్మ ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ స్మృత్యర్థం 40 ఏండ్ల కిందట పరిషత్తులో నెలకొల్పి, ఎండోమెంట్ నుంచి యేటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. తెలుగు భాషా సాహిత్యంలో సుధామ గర్వపడే స్థాయికి చేరుకున్నారన్నారు. ఈ సందర్భంగా పురస్కారాన్ని అందుకున్న సుధామ పదబంధ పారిజాతం అనే అంశంపై ప్రసంగం చేశారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, డాక్టర్ పి.సుమతీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.