హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మన ఇండ్లకు సమీపంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల నుంచే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నది. ఇందుకు టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లో మొత్తం 89 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటిలో 86 యూపీహెచ్సీలు, 10 బస్తీ దవాఖానాల్లో ఈ నెల ఒకటో తేదీ నుంచి టెలీ మెడిసిన్ సేవలను అందిస్తున్నది. టెలీ మెడిసిన్ ద్వారా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను నిమ్స్, ఉస్మానియా, ఎంఎన్జే తదితర దవాఖానాల ద్వారా అందిస్తున్నామని ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుక్మారెడ్డి తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు టెలీ మెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ఆ సమయంలో రోగులు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్లతో మాట్లాడవచ్చు.
రోగులు నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందు తమ దగ్గరలోని యూపీహెచ్సీ లేదా టెలీ మెడిసిన్ అందుబాటులో ఉన్న బస్తీ దవాఖానకు వెళ్లి పేరు నమోదు చేయించుకోవాలి. అనంతరం, అక్కడి సిబ్బంది రోగి వివరాలను, వ్యాధిని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరుస్తారు. ఈ వివరాలు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే కన్సల్టేషన్ వైద్యుడికి ఆన్లైన్ ద్వారా వెళ్తాయి. వాటిని పరిశీలించిన వైద్యులు రోగి సమస్యలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటారు. టెలీ మెడిసిన్కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. డాక్టర్ ప్రతి రోగితో కనీసం 15 నిమిషాలు మాట్లాడుతారు. కన్సల్టేషన్ పూర్తయిన వెంటనే వైద్య పరీక్షలు, మందులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్ ద్వారా పంపుతారు. వైద్య సిబ్బంది ఆ ప్రిస్క్రిప్షన్ను ఆధారంగా వైద్య పరీక్షలు చేస్తారు. మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు యూపీహెచ్సీ, బస్తీ దవాఖానాలలో అందుబాటులోఉన్నాయని వాటిని పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ రుక్మారెడ్డి తెలిపారు.
సూపర్ స్పెషాల్టీ సేవలు పొందాలంటే ప్రభుత్వ పరిధిలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి హాస్పిటల్స్ను ఆశ్రయించాల్సి వస్తున్నది. దీంతో కొంత మంది వ్యాధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని ప్రతి రోగికి సూపర్ స్పెషాల్టీ సేవలను బస్తీల మధ్యకే తెచ్చేందుకు ప్రభుత్వం నగరంలోని 86 యూపీహెచ్సీలు, 10 బస్తీ దవాఖానలలో టెలీ మెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో మరో 30 బస్తీ దవాఖానాలు, మూడు యూపీహెచ్సీలలో ఈ సేవలను ప్రారంభించనున్నాం. ప్రతిరోజు కనీసం 100 మంది రోగులకు టెలీ మెడిసిన్ ద్వారా సేవలందించాలని లక్ష్యం అని రుక్మారెడ్డి తెలిపారు.