రాచకొండ సీపీ కార్యాలయంలో టెలీ కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం
040-48214800లో సంప్రదిస్తే.. సలహాలు, సూచనలు
గత ఏడాది 200మందికి ఒత్తిడి నుంచి ఉపశమనం
కొవిడ్ సోకిందని భయంతో ఓ వ్యక్తి దవాఖాన భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో 14 రోజుల పాటు ఐసొలేషన్లో ఒంటరిగా ఉండి.. మానసిక ఒత్తిడికి గురై స్కీజోఫ్రీనియా వ్యాధి బారిన పడ్డాడు. ఇలాంటి సంఘటనలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. వీటిని అధిగమించేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ మానసిక వైద్యులు, నిపుణులతో నేరేడ్మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం మానసిక ఒత్తిడి నివారణ టెలి కౌన్సెలింగ్ కేంద్రంను ప్రారంభించారు. ఈ టెలి కౌన్సెలింగ్ను పొందే వారు 04048214800లో సంప్రదించాలని కోరారు. ఉదయం 9నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మానసిక ఒత్తిడికి అవకాశం ఇవ్వకుండా కావాల్సిన సలహాలు, సూచనలు నిపుణుల ద్వారా పొందవచ్చని సీపీ సూచించారు. ఈ టెలి కౌన్సెలింగ్ను మానసిక నిపుణులు, వైద్యులు అమీనా హుస్సేన్, కవితా నటరాజన్, డా.అనిత, దేవి శేషాద్రి, కీర్తిరెడ్డి, సుచిత, అబ్రహం, లక్ష్మి, ఆకృతీ అగర్వాల్, కృష్ణమోహన్, శ్రీవల్లి, ఏంజే డేవిడ్, కౌముది నాగరాజ్, నళిని, కిరణ్మయి అందజేస్తారని తెలిపారు. ఈ బృందం గత ఏడాది కూడా టెలి కౌన్సెలింగ్ను నిర్వహించి దాదాపు 200 మందికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, అడ్మిన్ డీసీపీ శ్రీవల్లి పాల్గొన్నారు.