హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర మెట్రో రైలు ప్రాజెక్టు కోసం తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఒకేసారి 1000 కోట్లు కేటాయించింది. అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలును నలుమూలలా విస్తరించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే మొదటి దశ పూర్తయి, మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన పాతబస్తీ మెట్రో కారిడార్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఇదిలా ఉండగా తాజా బడ్జెట్లో కేటాయించిన 1000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నిధులను ఎలా వెచ్చించాలనే అంశంపై హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) సంస్థ కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నది.
మెట్రో మొదటి దశ ప్రాజెక్టు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం రెండో దశను చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైలు సంస్థకు డీపీఆర్ బాధ్యతలను అప్పగించడంతో రెండోదశకు సంబంధించిన మూడు మార్గాల్లో సర్వే చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేసింది. ఇందులో ప్రధానంగా మొదటి దశలో చేపట్టిన నాగోల్-రాయదుర్గం మెట్రో కారిడార్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 31 కి.మీ మేర ఔటర్ రింగు రోడ్డు వెంబడి నిర్మించాలని నిర్ణయించారు. బీహెచ్ఈఎల్ లింగంపల్లి నుంచి కొండాపూర్, గచ్చిబౌలీ మీదుగా మెహిదీపట్నం, లక్డీకాపూల్ వరకు 28 కి.మీ మేర మరో మార్గాన్ని నిర్మించనున్నారు. ఆ తర్వాత మియాపూర్ నుంచి లింగంపల్లి 8 కి.మీ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కి.మీ మేర మరో రెండు లింకులను కలిపేలా రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.