భవనాలు, లే ఔట్ల అనుమతుల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం(టీఎస్ బీపాస్) సత్ఫలితాలు ఇస్తున్నది. దీంతో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 600 చదరపు గజాలలోపు ఉండే ఇండ్ల నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసిన వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తున్నది. ఇక నుంచి వెయ్యి నుంచి 2వేల గజాల పైన ఉన్న వాటికి సైతం అనుమతి ఇవ్వనున్నారు. అయితే నిర్మాణ దారులు అక్రమాలకు పాల్పడితే ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రంగంలోకి దిగి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో టీఎస్ బీ పాస్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ (75 నుంచి 600 గజాల వరకు గృహాలు), సింగిల్ విండో విధానంలో 600గజాలకు పైన గృహ నిర్మాణాలు/ వాణిజ్య అనుమతులు టీఎస్ బీపాస్ ద్వారా మంజూరు చేస్తున్నారు. 1000 నుంచి 2వేల గజాల పైన ఉన్న వాటికి డీపీఎంఎస్ (డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం) విధానంలో పర్మిషన్లు ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ చట్టానికి సంబంధించిన నిబంధనలను బల్దియా దశల వారీగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే భారీ నిర్మాణ అనుమతులు సైతం ఇక మీదట టీఎస్ బీపాస్ విధానం ద్వారానే ఇవ్వాలని, వచ్చే నెల నుంచి టీఎస్ బీపాస్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం దరఖాస్తుదారులు టీఎస్ బీ పాస్, డీపీఎంఎస్ రెండింటినీ ఉపయోగిస్తున్నామని, ఈ నెలాఖరుకు డీపీఎంఎస్ను పూర్తిగా నిలిపివేస్తామని, జులై నుంచి నిర్మాణ అనుమతుల ఆర్జీలను టీఎస్ బీపాస్ ద్వారానే తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీఎస్ బీపాస్ చట్టం పూర్తి స్థాయిలో అమలు ద్వారా అక్రమ నిర్మాణాలపై తక్షణం చర్యలు ఉండనున్నాయి. డీపీఎంఎస్ విధానంలో అనుమతులు పొంది ఆపై నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా నోటీసులు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాల్సి వచ్చేది. కానీ టీఎస్ బీపాస్లో నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసే అస్కారం ఉంటుంది.
పౌరులూ ఫిర్యాదు చేయొచ్చు
అక్రమ నిర్మాణాలపై స్పెషల్ టాస్క్ఫోర్స్ను నియమించిన సంగతి తెలిసిందే. సర్కిళ్ల వారీగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దింపారు. అక్రమ నిర్మాణాలకు శాశ్వత అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పౌరులు సైతం అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. మై జీహెచ్ఎంసీ , మొబైల్ యాప్, కంట్రోల్ రూం నం. 2111 1111, జీహెచ్ఎంసీ ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల ద్వారా అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులనే కాక రాతపూర్వకంగా, ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులనూ సంబంధిత టాస్క్ఫోర్స్ బృందాలకు చేరవేస్తామని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.