సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 ( నమస్తే తెలంగాణ ) : తెలంగాణ సౌత్ రీజన్- బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ కార్యాలయంలో హిందీ దివాస్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రం జారీ చేసిన రాజ్య భాష ప్రతిజ్ఞను ఉద్యోగులు, సిబ్బంది ఆలపించారు. ఈ సందర్భంగా తెలంగాణ సౌత్ రీజనల్ హెడ్ కె. విజయరాజు మాట్లాడుతూ.. కార్యాలయాల్లో వీలైనంతగా హిందీ భాష వినియోగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. రోజువారీ కార్యకలాపాలను హిందీలోనే నిక్షిప్త పరిచేలా చూడాలని కోరారు. హిందీలోనే కార్యాలయ పనులు నిర్వర్తించడంతో హిందీ ప్రాధాన్యతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి దోహదపడినవారమవుతామని అన్నారు. అనంతరం హిందీ దివాస్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. హిందీ దివాస్ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇచ్చిన సందేశాన్ని సీనియర్ మేనేజర్ జి. విజయ్ కుమార్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ టీవీవీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.