సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో హైటెక్స్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ట్రెడా 11వ ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు ట్రెడా అధ్యక్షుడు ఆర్.చలపతిరావు తెలిపారు. బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రెడా అధ్యక్షుడు చలపతిరావు, జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విజయ సాయి ప్రాపర్టీ షో వివరాలు తెలిపారు. ట్రెడా ప్రాపర్టీ షోలో వందకు పైగా బిల్డర్లు, డెవలపర్లు, భవన నిర్మాణ సామగ్రి సరఫరాదారులు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పరిశ్రమ స్నేహపూర్వక సంస్కరణలు, వినూత్న విధానాలు గణనీయ అభివృద్ధికి దోహదం చేశాయని పేర్కొన్నారు. కొవిడ్ తర్వాత తిరిగి రియల్ ఎస్టేట్ రంగం సాధారణ స్థితికి చేరుకుందన్నారు. కొనుగోలుదారులకు ఈ ప్రాపర్టీ షో చక్కని వేదికని, రూ.30 లక్షల నుంచి నాలుగు కోట్లకు పైగా ఫ్లాట్స్ ఈ షోలో అందుబాటులో ఉంటాయన్నారు. మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు.