రక్షక భటుడా.. నీ సేవలకు సెల్యూట్.. అంటున్నారు నగర వాసులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పోలీస్ విభాగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ.. ప్రెండ్లీ పోలీసులం అని నిరూపించుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో శాంతిభద్రతలను గాడిన పెడుతున్నారు. మొత్తానికి టెక్నాలజీని ప్రజలకు, పోలీసులకు మధ్యన వారధిలా మార్చేశారు.
రాష్ట్ర పోలీస్ విభాగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా టెక్నాలజీని ఉపయోగిస్తూ వేగంగా సేవలు అందిస్తున్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే హాక్ఐ, లాస్ట్ రిపోర్టు, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వేదికల ద్వారా ఫిర్యాదు చేస్తూ.. పోలీసుల సేవలు పొందుతున్నారు. మరో పక్క క్షేత్రస్థాయిలో ఉండే పెట్రోలింగ్ సిబ్బంది ఇంటివద్దకే వెళ్లి బాధితుల ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే వివిధ రకాల దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే పరిష్కరిస్తున్నారు.
ప్రజలకు అందించే సేవలు ఇలా ఉంటే.. కేసుల దర్యాప్తులో టెక్నాలజీని వాడుకుంటూ దూసుకుపోతున్నారు. సమాచార మార్పిడి వేగంగా జరగడంతో పాటు ప్రజల నుంచి వచ్చే వివిధ రకాలైన ఫిర్యాదులను వెను వెంటనే పరిష్కరిస్తూ ప్రజలకు మేమున్నామంటూ పూర్తి భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా 2015 నుంచి గణేశ్ మండపాల సమాచారంతో పాటు దీపావళికి జారీ చేసే ఎన్వోసీలు కూడా ఆన్లైన్లోనే అందిస్తున్నారు. నేరాలు జరిగినప్పుడు కేసుల దర్యాప్తు, నిందితులను పట్టించడంలో సీసీ కెమెరాలు, ఫేసియల్ రికగ్నైజేషన్, ఫింగర్ ప్రింట్స్తో నేరస్తులను గుర్తించడం వంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ కేసుల దర్యాప్తులో వేగం పెంచారు. నిందితులకు శిక్ష పడేవిధంగా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
2015లో హాక్ఐ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. ప్రస్తుతం 17 లక్షలకుపైగా యూజర్లు ఈ యాప్ను ఉపయోగిస్తున్నారు. ఇందులో నగర పోలీసులు 55,974 వివిధ రకాలైన పోస్టులను స్వీకరించారు. పోలీసులకు అందిన ఫిర్యాదులలో ఆధారాలు లేకపోవడం, తప్పుడు ఫిర్యాదులు మినహాయించి మిగతా అన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు.
వివిధ రకాలైన డాక్యుమెంట్లు పోయినప్పుడు పోలీస్ ఎన్ఓసీ సర్టిఫికెట్ అడుగుతుంటారు. దాని కోసం ప్రజలు పోలీస్స్టేషన్ల వెంబడి తిరుగకుండా నేరుగా హాక్ఐలో ఉన్న లాస్ట్ రిపోర్టు ద్వారా దరఖాస్తు చేసిన 72 గంటల్లో ఉచితంగా సర్టిఫికెట్ పొందవచ్చు.
సిటీ పోలీసులు పలువురి నేరస్తులకు సంబంధించిన డాటాబేస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. అనుమానితులు, పాత నేరస్తులు వివిధ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినప్పుడు, వారిని గుర్తించి ఆయా కెమెరాల ద్వారా సమాచారాన్ని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని ఐటీ సెల్కు అందిస్తుంటాయి.
నగరంలో జాబ్ కనెక్ట్తో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించడంలో నగర పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. 2017లో ప్రారంభించిన జాజ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగ యువత తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో జాబ్ మేళాలు ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా జాబ్ కనెక్ట్ పేరుతో ఓ బస్సును ఏర్పాటు చేసి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో తిరుగుతూ వివిధ కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఇంటర్వ్యూల ద్వారా ఆయా కంపెనీలు తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటాయి. ఉద్యోగ మేళాలకు సంబంధించిన వివరాలకు పోలీసులు ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుడి ఫోన్కు పంపిస్తుంటారు. ఇప్పటి వరకు 1,37,286 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా, 46 జాబ్మేళాలు నిర్వహించారు. 11,456 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలంటే అత్యాధునిక టెక్నాలజీ పరమైన సంస్కరణలు కావాలని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ అక్కడి కంటే మెరుగైన టెక్నాలజీని వాడుతూ ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఇంట్లో నుంచే పోలీసుల సేవలు పొందేవిధంగా వివిధ రకాలైన అప్లికేషన్లను అందుబాటులో ఉంచాం.
సమాచారం ఇచ్చిన వెంటనే స్థానికంగా ఉండే పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతో పాటు మొబైల్ యాప్లు, కేసుల దర్యాప్తులో నేరస్తులను పట్టుకోవడానికి వాడుతున్న టెక్నాలజీ పోలీసులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో కేసుల దర్యాప్తులో వేగం పెరగడంతో పాటు ప్రజలకు వేగంగా సేవలందిస్తూ పటిష్టమైన శాంతి భద్రతలను హైదరాబాద్లో అమలు చేస్తున్నాం. అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
నగర పోలీసులకు సోషల్మీడియా ద్వారా వివిధ రకాలైన సమాచారం అందుతుంది. పోలీసులు వెంటనే స్పందించారు.
వేదిక 2018 2019 2020 2021
వాట్సాప్ 5834 5586 4612 11764
ఫేస్బుక్ 2878 2516 7584 1628
ట్విట్టర్ 3081 2812 8862 1929
నగరంలో లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉంటుంది. అయితే సీసీ కెమెరాలలో రికార్డు అయిన వీడియోలు, ఫొటోలు కొన్ని సందర్భాల్లో సరిగ్గా కనిపించవు. వాటికి మరింత నాణ్యతను తెచ్చేందుకు వీడియో హెన్యాన్స్మెంట్ సాఫ్ట్వేర్ను వాడుతున్నారు.
2018 417 277
2019 375 299
2020 305 128
2021(జూన్) 104 59
పోలీసులు ప్రతి నిత్యం నిర్వహించే విధి నిర్వహణ, తరుచుగా నిర్వహించే బందోబస్తు, ఎన్నికలు, పండుగలు, ర్యాలీలు, వేడుకలతో పాటు రౌడీషీటర్స్ మానిటరింగ్, మై వెహికల్ ఈజ్ సేఫ్, పీడీ యాక్టులు, ఇటీవల కొవిడ్ సస్పెక్ట్స్, కొవిడ్ ట్రాకింగ్ టూల్స్ను టీఎస్ కాప్స్ యాప్ ద్వారా వాడుతున్నారు. ఈ యాప్లో 58 రకాలైన సేవలు అందిస్తుండగా నగరంలో ఇప్పటి వరకు 8414 మంది ఉపయోగిస్తున్నారు. ఇటీవల మూడు కిలోమీటర్ల వరకు కొవిడ్కు సంబంధించిన వారిని ట్రాక్ చేసే విధంగా ఇందులో కొత్త టెక్నాలజీని ఉపయోగించి వారికి కొవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీసులు సేవలందించారు.
ఇదిలా ఉండగా జేఆర్ఎంఎస్ అప్లికేషన్ ద్వారా సడాట్తో కలిపి కావాల్సిన సమాచారాన్ని పోలీసులకు అందజేస్తున్నది. దీని ద్వారా పాత నేరస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించవచ్చు. కొత్తగా కేసులకు సంబంధించిన రికార్డులను డాటాబేస్లో చేర్చడంతోపాటు డాటాబేస్ నుంచి పోలీసులకు కావాల్సిన సమాచారం పొందవచ్చు. పోలీస్స్టేషన్ల వారీగా టవర్ డంప్ అనాలసిస్ అప్లికేషన్ను ఉపయోగిస్తూ పోలీసులకు ఆయా కేసుల్లో కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.