సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా, లాక్డౌన్ కాలం పోలీసుశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చింది. గతంలో మాదిరి కటువుగా ఉండకుండా ఆపన్నులను ఆదుకునే ఆలోచన పుట్టించింది. ఉన్నతాధికారి మొదలు..హోంగార్డు వరకు సేవా భావాన్ని అలవర్చుకున్నారు. తమ తోటివారితోపాటు ఆపదలో ఉన్న వారికి ఏదో విధంగా సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. గతంలో పోలీసు అంటే మూడు అడుగుల దూరం ఉండి మాట్లాడే వారు. అది కూడా భయంతో. ఇప్పుడు ఈ అనుభవం వారిలో మార్పును తీసుకురావడంతోపాటు సామాన్యుడితో ఎలా ప్రవర్తించాలి ? వారి కండ్లలో ఆనందాన్ని ఎలా చూడాలనే అంశాలను అవగతం చేసుకున్నారు.
శాఖలో పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ సిబ్బందితో వ్యవహరించే తీరును కరోనా, లాక్డౌన్ నేర్పిన పాఠంతో పూర్తిగా మార్చేసుకున్నారు. ఇప్పుడు మనమంతా ఓ కుటుంబంగా పనిచేస్తున్నారు. ఓ పక్క విధి నిర్వహణలో కఠినంగా ఉంటూనే ఆపదలో ఉన్నవారికి, ఆకలైన వారికి భోజనం,షెల్టర్ ఇస్తూ అండగా ఉంటున్నారు. అదే విధంగా గతంలో ఉన్నతాధికారుల తీరుతో అసంతృప్తితో పనిచేసే సిబ్బంది లాక్డౌన్, కరోనా నేర్పిన పాఠాలతో, అధికారులు సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వారిలో హుషారు నింపుతున్నది. ఇప్పుడు అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేసే వాతావరణాన్ని మార్చుకున్నారు. ఇప్పటివరకు వారి సర్వీసులో వినని లాక్డౌన్, కనపడని వైరస్తో పోరాటం, తాజాగా నెలకొంటున్న పరిస్థితులు, ఎంత డబ్బు ఉన్నా ప్రాణాన్ని నిలబట్టేందుకు సహాయపడని వాస్తవ ఘటనలతో పోలీసు బాసులతోపాటు ఉన్నతాధికారుల్లో చాలావరకు మార్పు కనపడుతుంది.
నేను పోలీసుశాఖలో చేరి 20 ఏండ్లు గడుస్తున్నది. ఇప్పటివరకు లాక్డౌన్ మాట వినలేదు..చూడలేదు. కనిపించని వైరస్ ఇంత బీభత్సాన్ని సృష్టిస్తుందని ఊహించలేదు. ఈ కాలం చాలామార్పు తీసుకొచ్చింది. ఉన్నతాధికారులు సిబ్బందికి ఏ చిన్న కష్టం వచ్చినా వెన్నంటి ఉంటున్నారు. దయనీయస్థితిలో ఉన్నవారికి సేవలు అందించడం మానవ సేవలో కొత్త పాఠాన్ని నేర్పింది. -రమేశ్, ఇన్స్పెక్టర్, పేట్బషీరాబాద్ పోలీసుస్టేషన్
కరోనా కష్టకాలంలో అధికశాతం పోలీసుల వైపు చూస్తున్నారు. భోజనం, వైద్య సేవలు, ప్లాస్మా, రక్తదానాలు, అంబులెన్స్, ఇతరాత్ర సేవలపై పోలీసులపై ఆధారపడుతున్నారు. పోలీసుల సేవలను దృష్టిలో పెట్టుకొని చాలామంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్పొరేట్ కంపెనీలు పోలీసుల ద్వారానే వారి సేవలను ప్రజల చేరేలా చూస్తున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన సర్వేలలో పోలీసు ప్రతిష్ట ప్రజల్లో 30 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగినట్లు కొందరు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.
ఉన్నతాధికారులు కరోనా, లాక్డౌన్ కాలంలో సిబ్బందితోపాటు వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడం చాలా సంతోషాన్ని నింపుతున్నది. దీంతో అధికారులు, సిబ్బంది మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రజలకు, నిస్సహాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ప్రతిఒక్కరూ పోలీసుల వైపు చూస్తున్నారు. ఇది మాకెంతో బలాన్ని ఇస్తున్నది. అధికారులు, సిబ్బందికి ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు ఇస్తూ సిబ్బందిలో నైపుణ్యాన్ని బయటకు తీస్తున్నారు. -నర్సింహారెడ్డి, ఇన్స్పెక్టర్,బాచుపల్లి