ఖైరతాబాద్, జూలై 16: ‘కేంద్రంలో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత మీడియా రంగంపై ప్రత్యక్ష, పరోక్ష అణచివేతలు, నిర్బంధాలు అధికమయ్యాయి. పత్రికలు ఫాసిజం అడుగుజాడల్లో నడుస్తూ, సమాచార రంగాన్ని ఆక్రమించాయి. పొలిటికల్ కార్టూన్కు నేడు అనుకూల పరిస్థితులు లేవు’ అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డుల ప్రదానోత్సవ సభ శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ వేదికగా జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు అధ్యక్షతన జరిగిన ఈ సభలో దక్కన్ క్రానికల్ కార్టూనిస్ట్, కార్టూన్ ఎడిటర్ సుభానికి కార్టూనిస్టు శేఖర్ మెమోరియల్ అవార్డును మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, టీఎస్పీఎస్సీ పూర్వ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి చేతుల మీదుగా అందజేశారు.
ఇందుకు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లం నారాయణ మాట్లాడుతూపొలిటికల్ కార్టూన్లో శేఖర్ తన మార్కును చాటుకున్నారని, రాజకీయ కార్టూన్లో చేతనం తీసుకురావాలని శేఖర్ ఆశించారన్నారు. ఆయన మరణించినా కార్టూన్ల ద్వారా జనాల్లో కలిగిన చైతన్యం రూపంలో మనలో బతికే ఉన్నాడన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పొలిటికల్ ఫిలాసఫీ కలిగిన కార్టూనిస్టుగా శేఖర్ స్ఫృషించని అంశం లేదన్నారు. వెయ్యి మాటలు, పదాలు ఒక్క బొమ్మతో సమానమని అనేక సందార్భాల్లో ఆయన చిత్రాల ద్వారా రుజువైందన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కార్టూనిస్ట్ శేఖర్ అమెరికా దౌర్జన్యం మీద వేసిన కార్టూన్లు ఆలోచింప చేసిందని, ఆయనకు ప్రత్యేక రాజకీయ, సామాజిక అభిప్రాయాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. తనను సాహిత్యం ఎక్కువగా చదవమని నాడు సూచించినట్టు గుర్తు చేశారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ శేఖర్ రచించిన ‘క్యాస్ట్ క్యాన్సర్’ పుస్తకంలో తనతో ముందు మాట రాయించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకులు వేణు సంకోజు, ‘వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు’ విన్నర్ కార్టూనిస్ట్ శంకర్, ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్, చంద్రకళ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.