రవీంద్రభారతి, జూలై 20 : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఘంటసాల స్వరభారతి ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ స్వర మనోహర గీతాలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్గుప్తా హాజరై ప్రసంగించారు. ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గేయాలు మానవ సమాజం ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉంటాయని అన్నారు. ఇలాంటి సినీ స్వర మనోహర గీతాల కార్యక్రమం నిర్వహించిన బి.శ్రీనివాస్, గాయని ఆమనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయకుడు పి.సుభాష్, విజయ, రవి, మోహనకృష్ణ, సీహెచ్ తులసిరామ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.