హైదరాబాద్ : చరిత్రకు సాక్షిభూతంగా నిలిచే పురాతన వారసత్వ వస్తు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ‘ఆద్య కళ’ తెలంగాణ యత్నిక్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పేరుతో ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి ఇవాళ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరుదైన పురాతన వస్తు సంపదను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆదివాసీ, గిరిజన, జానపదలు వినియోగించిన పలు వాయిద్య పరికరాలు, కళారూపాలు, విగ్రహాలు, చిత్రాలను ఒక్కచోట చేర్చి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన జయధీర్ తిరుమలరావు బృందాన్ని ఆయన అభినందించారు. వీటిని భద్రపరిచేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కృషి
చేస్తామన్నారు. ఎగ్జిబిషన్లో ఉంచిన ప్రతి ఒక్క వస్తువుకు ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకుడు కే శ్రీనివాస్, ప్రొఫెసర్ మనోజ, డాక్టర్ పృథీ, స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.